prophet row: ముస్లిం దేశాలన్నీ భారతీయ ఉత్పత్తులను బహిష్కరించాలంటూ బంగ్లాదేశ్లో నిరసనలు
మహమ్మద్ ప్రవక్తపై నురూప్ శర్మ, నవీన్ జిందాల్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బంగ్లాదేశ్లో ప్రార్థనల అనంతరం వేలాది మంది ముస్లింలు నిరసన ప్రదర్శనలకు దిగారు. ముస్లిం మెజారిటీ దేశాలన్నీ భారత్తో దౌత్యపర సంబంధాలను తెంచుకోవాలని, భారతీయ ఉత్పత్తులను బహిష్కరించాలని అన్నారు.
- T Venkateshwarlu
- Published On : June 10, 2022 / 06:11 PM IST
Muslims In Bangla
prophet row: మహమ్మద్ ప్రవక్తపై నురూప్ శర్మ, నవీన్ జిందాల్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బంగ్లాదేశ్లో ప్రార్థనల అనంతరం వేలాది మంది ముస్లింలు నిరసన ప్రదర్శనలకు దిగారు. నురూప్ శర్మ, నవీన్ జిందాల్ను శిక్షించాల్సిందేనని డిమాండ్ చేశారు. ముస్లిం మెజారిటీ దేశాలన్నీ భారత్తో దౌత్యపర సంబంధాలను తెంచుకోవాలని, భారతీయ ఉత్పత్తులను బహిష్కరించాలని అన్నారు. వేలాది మంది ముస్లింలు బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు నిరసనగా వెళ్తున్నారు. భారత్లో మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పటికీ బంగ్లాదేశ్ ప్రభుత్వం బహిరంగంగా ఆ వ్యాఖ్యలను ఖండించకపోవడం పట్ల కూడా నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
బైతుల్ ముక్రం మసీదు నుంచి ముస్లింలు ర్యాలీగా బయలుదేరారు. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగానూ నినాదాలు చేశారు. నురూప్ శర్మ, నవీన్ జిందాల్పై బీజేపీ పార్టీపరంగా చర్యలు తీసుకుని వదిలేయడం సరికాదని, వారిద్దరినీ శిక్షించాలని నిరసకారులు డిమాండ్ చేశారు. మోదీ సర్కారు తీరును ఖండిస్తూ పార్లమెంటులో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ప్రకటన చేయాలని వారు అంటున్నారు. కాగా, ఇప్పటికే ఖతార్లోని ఓ సూపర్ మార్కెట్లో భారతీయ ఉత్పత్తులను తొలగించిన విషయం తెలిసిందే. పలు ముస్లిం దేశాలు ఇప్పటికే నురూప్ శర్మ, నవీన్ జిందాల్ చేసిన వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేశాయి.
