పానీపూరి అంటే ఇష్టపడని వారు ఉండరు. ఇక చిన్న పిల్లల సంగతి చెప్పక్కర్లుదు. ఎంతో ఇష్టంగా తింటారు.
పానీపూరి అంటే ఇష్టపడని వారు ఉండరు. ఇక చిన్న పిల్లల సంగతి చెప్పక్కర్లుదు. ఎంతో ఇష్టంగా తింటారు. అయితే అదే పానీపూరి ప్రాణం మీదకు తెచ్చింది. పానీపూరి తిని 40మంది చిన్నారులు అస్వస్థతకు గురైన ఘటన సోమవారం(మే 25,2020) రాత్రి ఆదిలాబాద్ పట్టణంలో కలకలం రేపింది. అస్వస్థతకు గురైన వారంతా ఐదు నుంచి పదేళ్ల వయస్కులే కావటంతో ఆందోళన రేగింది. ఆదిలాబాద్లోని ఖుర్షిద్నగర్, సుందరయ్యనగర్కు చెందిన పలువురు చిన్నారులు సోమవారం సాయంత్రం కాలనీలో తోపుడు బండి దగ్గర పానీపూరి తిన్నారు.
వాంతులు, విరేచనాలు చేసుకున్న పిల్లలు:
ఇంతలో ఏం జరిగిందో కానీ రాత్రి 9 గంటల నుంచి ఒక్కొక్కరు వాంతులు, విరేచనాలు చేసుకోవటం ప్రారంభించారు. ఒకరి తర్వాత ఒకరు రిమ్స్కు వెళ్లారు. అలా ఈ సంఖ్య 40కి చేరింది. రాత్రి 11 గంటలకు సైతం కొందరు చిన్నారులను ఆసుపత్రికి తీసుకొస్తూనే ఉన్నారు. వారందరికి డాక్టర్లు చికిత్స అందించారు. భయపడాల్సిన పని లేదని డాక్టర్లు చెప్పారు. అస్వస్థతకు గురైన చిన్నారులకు ఎలాంటి ప్రాణాపాయం లేదని, అందరూ కోలుకుంటున్నారని రిమ్స్ డైరెక్టర్ బలరాం బానోత్ తెలిపారు. పిల్లలు అస్వస్థతకు గురి కావడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. ఏం జరిగిందోనని కంగారు పడ్డారు. పిల్లలు కోలుకోవడంతో వారంతా ఊపిరిపీల్చుకున్నారు.
లాక్ డౌన్ నిబంధనల ఉల్లంఘన:
పానీపూరి తిన్న పిల్లలు ఆసుపత్రి పాలైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. పిల్లల తల్లిదండ్రులకు భయాందోళనకు గురి చేసింది. కాగా, ప్రస్తుతం లాక్ డౌన్ అమల్లో ఉంది. లాక్డౌన్ నిబంధనల ప్రకారం పానీపూరి తోపుడు బండ్ల నిర్వహణకు అనుమతి లేదు. అయినా కొందరు తోపుడు బండ్లపై రోడ్డెక్కుతున్నారు. ఇళ్ల దగ్గరకే వెళ్లి పానీపూరి విక్రయిస్తున్నారు. దీనిపై అధికారులు దృష్టి పెట్టాలని, లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. అసలే కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఔట్ సైడ్ ఫుడ్ తినకపోవడమే మంచిదని డాక్టర్లు చెబుతున్నారు. పిల్లల విషయంలో మరీ జాగ్రత్తగా ఉండాలంటున్నారు. వారికి అస్సలు బయటి ఆహారం పెట్టకపోవడమే మంచిదంటున్నారు.
Read: వ్యవసాయం దండగ కాదు..పండగ..ఇది సీఎం కేసీఆర్ కల : మంత్రి హరీశ్ రావు