విశాఖ ఎల్జి పాలిమర్స్ కంపెనీ ముందు గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. కంపెనీ మూసివేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. కంపెనీ మెయిన్ గేటు ముందు ధర్నా చేపట్టడంతో… పలువురు ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వి వాంట్ జస్టిస్..న్యాయం జరిగేంత వరకు ఆందోళన కొనసాగుతుందని ఖరాఖండిగా చెప్పారు. ఐదు గ్రామాలకు చెందిన ప్రజలు అక్కడకు చేరుకున్నారు.
ఎన్ని రోజులు పడాలి బాధలు.. ఎవరు పట్టించుకోరా ? విషవాయువులు వెలువడుతూ..ప్రాణాలో పోతున్నా లెక్కలేదా ? కంపెనిని మూసివేయాల్సిందే ..అంటూ గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. 2020, మే 09వ తేదీ శనివారం ఉదయం భారీ సంఖ్యలో గ్రామస్తులు మృతదేహాలతో ఆందోళన చేపట్టారు. ముందే ఊహించిన పోలీసులు, కంపెనీ సిబ్బంది అక్కడే మోహరించి గేట్లు మూసివేశారు.
కంపెనీ లోనికి వెళ్లేందుకు వారు ప్రయత్నించడం..పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వీరిని సముదాయించేందుకు పోలీసు అధికారులు ప్రయత్నిస్తున్నారు. కంపెనీ మూసివేస్తే..తాము వెనక్కి వెళుతామని భీష్మించు కూర్చొన్నారు. కంపెనీకి చెందిన గేట్లను కొంతమంది ఎక్కి లోపలకు వెళ్లడంతో ఫుల్ టెన్షన్ నెలకొంది. ఆందోళన జరుగుతున్న సమయంలో రాష్ట్ర డీజీపీ కంపెనీలో ఉన్నారు.
ఆయనను అడ్డుకొనేందుకు ప్రయత్నించిన వారిని పోలీసులు నెట్టివేశారు. చివరకు ఆందోళనకారులను కట్టడి చేసి..భారీ బందోబస్తు మధ్య డీజీపీ బయటకు వెళ్లిపోయారు. చివరకు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.
ఎల్జి పాలిమర్స్ గ్యాస్ లీకేజీ బాధితులకు చికిత్స కొనసాగుతోంది. కేజీహెచ్లో 225 మంది బాధితులకు వైద్యులు చికిత్స చేస్తున్నారు. అలాగే వివిధ ప్రైవేటు ఆస్పత్రుల్లో వందలాది మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. కేజీహెచ్లో 50 మంది చిన్నారులకు చికిత్స కొనసాగుతోంది. స్టైరిన్ గ్యాస్ చిన్న పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
కళ్ళ మంటలు, చర్మంపై దద్దుర్లతో చిన్నారులు నరకం అనుభవిస్తున్నారు. మరోవైపు ఎల్జి పాలిమర్స్ కంపెనీ పరిసర గ్రామాల ప్రజలకు 26 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో 9 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయగా… జీవీఎంసీ ఆధ్వర్యంలో 17 పునరావాస కేంద్రాలు కొనసాగుతున్నాయి. వీరికి సింహాచలం దేవస్థానం, స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వర్యంలో భోజన సదుపాయాలు ఏర్పాటు చేశారు.
Read More :
* వైజాగ్ గ్యాస్ లీక్ ఎఫెక్ట్: పిల్లల శరీరంపై మంటలు, దుద్దుర్లు…కళ్లుకూడా తెరవలేకపోతున్నారు