Godavari floods: భద్రాచలం వద్ద కొనసాగుతున్న గోదావరి ఉధృతి.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ
భద్రాచలం వద్ద గోదావరి మరోసారి ఉగ్రరూపం దాల్చుతోంది.. అంతకంతకూ గోదావరిలో వరద ఉధృతి పెరుగుతోంది. నీటిమట్టం 53 అడుగులకు చేరడంతో అధికారులు మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
- Harishth Thanniru
- Updated on- August 16, 2022 / 09:24 PM IST
Godavari Flood
Godavari floods: భద్రాచలం వద్ద గోదావరి మరోసారి ఉగ్రరూపం దాల్చుతోంది.. అంతకంతకూ గోదావరిలో వరద ఉధృతి పెరుగుతోంది. నీటిమట్టం 53 అడుగులకు చేరడంతో అధికారులు మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు రాత్రికి భద్రాచలం వద్ద గోదావరి 55 అడుగులకు చేరుకోవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. వరద ఉధృతి పెరుగుతుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
ఇదిలాఉంటే గత నెలలో గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో నదీ పరివాహక ప్రాంతాలు నీటమునిగాయి. వారం రోజుల పాటు లోతట్టు ప్రాంతాల ప్రజలు గ్రామాలను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. ఈ నెలలో మరోసారి గోదావరి ఉగ్రరూపం దాల్చుతుండటంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వచ్చిచేరుతుండటంతో నెల రోజుల్లో మూడు సార్లు మూడో ప్రమాద హెచ్చరిక స్థాయికి వరద వచ్చి చేరింది.
ఇప్పటికే భద్రాచలం, పినపాక నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాల్లో రోడ్ల మీదకు నీళ్లు వచ్చిచేరాయి. భద్రాచలం నుంచి చర్ల, వెంకటాపురం రహదారి మీదికి వరద నీరు చేరింది. మరోవైపు పోలీసులు అప్రమత్తమయ్యారు. గోదావరి ముంపు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ కోరారు. అత్యవసరమైతే డయల్ 100 నెంబర్ కు ఫోన్ చేసి పోలీస్ వారి సహాయం పొందాలని, 24గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటామని తెలిపారు.
