Hemant Soren: నేను ముఖ్యమంత్రిని.. దేశం విడిచి పారిపోతానా? ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్
తనపై వచ్చిన అవినీతి ఆరోపణలు, ఈడీ విచారణపై ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ స్పందించారు. ఈ ఆరోపణల్లో నిజం లేదన్నారు. ఒక ముఖ్యమంత్రి అయిన తాను దేశం విడిచి పారిపోతానా అని ప్రశ్నించారు.
- Narender Thiru
- Published On : November 17, 2022 / 02:55 PM IST
Hemant Soren: అక్రమ మైనింగ్, మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఝార్ఖండ్ సీఎం హేమత్ సోరెన్ గురువారం ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తాను.. దేశం విడిచి పారిపోతానా అని ప్రశ్నించారు.
ఈ కేసుకు సంబంధించి ఈడీ ఆయనకు సమన్లు జారీ చేసింది. విచారణకు హాజరు కావాలని కోరింది. ఈడీ విచారణకు వెళ్లే ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘నేను రాజ్యాంగబద్ధమైన ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాను. కానీ, విచారణ జరుగుతున్న తీరు.. నాకు సమన్లు జారీ చేయడం చూస్తే నేను దేశం విడిచిపారిపోతానేమో అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. దేశం విడిచి వెళ్లిపోయింది వ్యాపారస్తులే. రాజకీయ నాయకులు కాదు. నన్ను పదవిలోంచి దించేయాలని ఎప్పట్నుంచో ప్రయత్నిస్తున్నారు. ఒకప్పుడు లోలోపల కుట్రలు చేసేవాళ్లు. ఇప్పుడు బహిరంగంగానే చేస్తున్నారు’’ అని హేమంత్ సోరెన్ వ్యాఖ్యానించారు.
కాగా, అక్రమ మైనింగ్ వ్యవహారంలో మొత్తం రూ.1,000 కోట్ల అవినీతి జరిగినట్లు ఈడీ ఆరోపించింది. అయితే, హేమంత్ సోరెన్.. అలాంటి అవకాశమే లేదని కొట్టిపారేశాడు. ‘‘రూ.1,000 కోట్ల విలువైన గ్రానైట్ రవాణా చేయాలంటే భారీ రవాణా సామర్ధ్యం కావాలి. అందుకు 20,000 రైల్వే ర్యాక్లు లేదా 33 లక్షల ట్రక్కులు కావాలి. సరైన ఆధారాలు లేకుండా రైల్వే శాఖ ఇలాంటి వాటి రవాణాకు అనుమతించదు. మీరు రైల్వే శాఖకే విరుద్ధంగా ప్రవర్తిస్తారా’’ అని హేమంత్ సోరెన్ ప్రశ్నించారు.
