Bhatti vikramarka on internal matters of congress: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో చోటుచేసుకుంటోన్న పరిణామాలు హాట్ టాపిక్గా మారాయి. పలువురు కాంగ్రెస్ కీలక నేతలు వరుసగా ఆ పార్టీని వీడుతుండడం, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తున్న ఘటనలు ఆ పార్టీకి షాక్ ఇస్తున్నాయి. వీటిపై కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క స్పందించారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత సమస్యలు ఉన్నాయని ఆయన చెప్పాయి. అయితే, పార్టీ విషయాలు బయటపెట్టి మాట్లాడడానికి తాను ఇష్టపడనని అన్నారు. సంగారెడ్డి కాంగ్రెస్ కార్యకర్తల్లో జగ్గారెడ్డి యాక్టివ్గా ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు.
మునుగోడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటవంటిదని ఆయన చెప్పారు. ఉప ఎన్నికలో గతంలో కంటే ఇప్పుడు కాంగ్రెస్కు అధిక మెజారిటీ వస్తుందని ఆయన అన్నారు. మునుగోడులో కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్యే పోటీ ఉంటుందని ఆయన చెప్పారు. ఆగస్టు 9 నుంచి 15 వరకు జిల్లా కాంగ్రెస్ నేతల పాదయాత్ర ఉంటుందని చెప్పారు. కుసుమంచి నుంచి సత్తుపల్లి వరకు తాను పాదయాత్ర చేస్తానని తెలిపారు.
నీతి ఆయోగ్ సమావేశ హాజరుకాబోమంటూ తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పిన విషయం తెలిసిందే. నీతి ఆయోగ్ సమావేశానికి హాజరుకాకపోవడం కేసీఆర్ ఇష్టమని భట్టి విక్రమార్క అన్నారు. కాగా, మునుగోడు నుంచి గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేయడంతో ఇప్పుడు తెలంగాణలోని ప్రధాన పార్టీలన్నీ ఆ ఉప ఎన్నికపైనే దృష్టి పెట్టాయి.