IBS Ragging Incident : కలకలం రేపుతున్న IBS కాలేజీ ర్యాగింగ్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. జూనియర్ విద్యార్థిపై పది మంది సీనియర్లు ర్యాగింగ్ కు పాల్పడ్డారని గుర్తించిన పోలీసులు.. ఇప్పటికే ఐదుగురిని అరెస్ట్ చేశారు. మరో ఐదుగురు విద్యార్థుల కోసం గాలిస్తున్నారు. అటు ర్యాగింగ్ ఘటనలో యాజమాన్యం నిర్లక్ష్యంపైనా పోలీసులు దృష్టి పెట్టారు. ఈ కేసులో మేనేజ్ మెంట్ నిర్లక్ష్యం ఉంటే చర్యలు తప్పవంటున్నారు పోలీసులు.
ర్యాగింగ్ ఘటనపై వివిధ కోణాల్లో దర్యాఫ్తు చేస్తుండగా.. నాలుగు పోలీసు బృందాలు విచారణలో పాల్గొంటున్నాయి. ఈ నెల 1వ తేదీన ఐబీఎస్ కాలేజీలో ర్యాగింగ్ ఘటన చోటు చేసుకుంది. బాధితుడి ఫిర్యాదు చేయగా పోలీసులు రాజీ కుదిర్చి పంపారు. దీనికి సంబంధించి బాధిత విద్యార్థి మంత్రి కేటీఆర్ కు ట్వీట్ చేయడంతో 12మంది సీనియర్ విద్యార్థులపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు వర్సిటీ యాజమాన్యం ఆ 12మంది విద్యార్థులను సస్పెండ్ చేసింది. ఈ ఘటనపై ఐబీఎస్ లో యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్ దర్యాఫ్తు అనంతరం మరికొంత మంది విద్యార్థులపై వేటు పడే అవకాశం ఉంది.
ఐబీఎస్ కాలేజీలో ర్యాగింగ్లో భాగంగా కొందరు సీనియర్లు హద్దుమీరిన ఘటన కలకలం రేపుతోంది. ఒక జూనియర్ పై దాడికి దిగారు. రూమ్లోకి తీసుకెళ్లి, ముఖంపై పౌడర్ చల్లి.. విచక్షణారహితంగా కొట్టారు. తమకు ఎదురు చెప్పాడని.. కోపంతో రెచ్చిపోయారు. వారి దెబ్బలకు తీవ్రంగా గాయపడిన విద్యార్థి.. వెంటనే తల్లిదండ్రులకు ఫోన్ చేసి, జరిగిన విషయాన్ని వివరించారు. దీంతో భయబ్రాంతులకు గురైన ఆ విద్యార్థి తల్లిదండ్రులు.. వెంటనే క్యాంపస్కు చేరుకొని, తమ పిల్లాడిని తీసుకెళ్లారు. దాడి చేసిన సీనియర్లపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్ కోసం 10TV చూడండి.
ఇంత దారుణంగా ర్యాగింగ్కు పాల్పడుతుంటే.. కాలేజీ యాజమాన్యం ఏం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు.. ఆ విద్యార్థిపై దాడి చేసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో, అది వైరల్ అయ్యింది.
ఈ వీడియోపై నెటిజన్లు ట్విటర్లో మంత్రి కేటీఆర్, హైదరాబాద్ పోలీసులను ట్యాగ్ చేసి.. ఆ సీనియర్లకు తగిన బుద్ధి చెప్పాలని ఫిర్యాదు చేశారు. స్పందించిన కేటీఆర్.. నిందితులపై చర్యలు తీసుకోవాలని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్రకు సూచించారు. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న పోలీసులు దర్యాఫ్తు ముమ్మరం చేశారు. అటు కాలేజీ యాజమాన్యం.. ర్యాగింగ్కు పాల్పడిన విద్యార్థులపై చర్యలు తీసుకుంది. ఏడాది పాటు సస్పెండ్ చేసింది. కాగా, IBS కాలేజీలో ఎప్పటి నుంచో ర్యాగింగ్ జరుగుతోందని ఆరోపణలున్నాయి.