India Squad For Asia Cup 2022 : యూఏఈ వేదికగా ఆసియా కప్ జరగనుంది. ఆగస్టు 27 నుంచి మ్యాచులు ప్రారంభం కానున్నాయి. ఆసియా కప్ లో పాల్గొనే భారత జట్టును బీసీసీఐ ఎంపిక చేసింది. రోహిత్ శర్మ కెప్టెన్ గా వ్యవహరిస్తాడు. గాయం, కరోనా ప్రభావం నుంచి కోలుకున్న కేఎల్ రాహుల్ మళ్లీ జట్టులోకి వచ్చాడు. రాహుల్ వైస్ కెప్టెన్ గా కొనసాగనున్నాడు.
ఫామ్ కోల్పోయి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా మళ్లీ జట్టులోకి వచ్చాడు. ఇటీవల వెస్టిండీస్ తో సిరీస్ కు సెలెక్టర్లు కోహ్లీకి విశ్రాంతినిచ్చిన సంగతి తెలిసిందే. ఇక, జట్టులో కొత్త ముఖాలకు స్థానం కల్పించలేదు. ప్రధానంగా, టీ20 వరల్డ్ కప్ ను దృష్టిలో ఉంచుకుని జట్టు ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.
ఆసియా కప్ లో ఆడే భారత జట్టు ఇదే..
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర చహల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్, అవేష్ ఖాన్.
కాగా, గాయాల కారణంగా స్టార్ పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్ లు ఆసియా కప్ కు దూరం అయ్యారు. వారిద్దరి పేర్లను పరిగణనలోకి తీసుకోలేదని బీసీసీఐ తెలిపింది. ప్రస్తుతం వారు బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో కోలుకుంటున్నారని వెల్లడించింది. ఇక, ఆసియా కప్ కోసం శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, దీపక్ చహర్ స్టాండ్ బై ఆటగాళ్లుగా కొనసాగుతారని బోర్డు వెల్లడించింది.
?#TeamIndia squad for Asia Cup 2022 – Rohit Sharma (Capt ), KL Rahul (VC), Virat Kohli, Suryakumar Yadav, Deepak Hooda, R Pant (wk), Dinesh Karthik (wk), Hardik Pandya, R Jadeja, R Ashwin, Y Chahal, R Bishnoi, Bhuvneshwar Kumar, Arshdeep Singh, Avesh Khan.
— BCCI (@BCCI) August 8, 2022
ఆసియా కప్ లో తొలి మ్యాచ్ లోనే తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో భారత్ తలపడనుంది. ఆ తర్వాత ఆగస్టు 31న క్వాలిఫైయింగ్ టీమ్ తో తలపడనున్నాయి. ఆసియా కప్ కు 5 టీమ్ లను(భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఆఫ్ఘానిస్తాన్) ఫైనల్ చేశారు. 6వ జట్టుని క్వాలిఫయర్ మ్యాచ్ ద్వారా నిర్ణయిస్తారు. క్వాలిఫయర్ అర్హత కోసం కువైట్, యూఏఈ, హాంగ్ కాంగ్, సింగపూర్ జట్లు తలపడనున్నాయి.
సెప్టెంబర్ 3 నుంచి ఆసియా కప్ టోర్నమెంట్ లో సూపర్-4 స్టేజ్ బిగిన్ అవుతుంది. దుబాయ్ లో సెప్టెంబర్ 11న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ ఏడాది ఆసియా కప్ ను టీ20 ఫార్మాట్ లో నిర్వహిస్తున్నారు. రెండు వేదికలు దుబాయ్, షార్జాలతో మ్యాచులు జరగనున్నాయి. భారత జట్టు ఇప్పటివరకు ఏడుసార్లు ఆసియా కప్ టైటిల్ నెగ్గింది. ఆ తర్వాత 5 సార్లు ఆసియా కప్ నెగ్గి శ్రీలంక రెండో స్థానంలో ఉంది.