Nitish kumar: రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరంటారు. తమ తమ అవసరాల్ని బట్టి రాజకీయ మిత్రుత్వాలు, శత్రుత్వాలు ఏర్పడుతుంటాయి. మూడేళ్ల క్రితం శివసేన-బీజేపీ వ్యవహారంలో ఇది స్పష్టమైంది. పాతికేళ్ల స్నేహాన్ని వీడి ఇరు పార్టీలు వైరి పార్టీలుగా మారాయి. ఇలాంటి సంకేతాలే బిహార్లో కనిపిస్తున్నాయి. బీజేపీ నేతలు వరుసపెట్టి నితీష్పై చేస్తున్న విమర్శలు.. బిహార్లో బీజేపీ దూకుడు చూస్తుంటే కమల పార్టీ టార్గెట్ ఆర్జేడీ కాకుండా జేడీయూనే అనే అనుమానాలు బలపడుతున్నాయి. దశాబ్దానికి పైగా బీజేపీ-జేడీయూ మిత్రపక్షాలుగా ఉంటూ వస్తున్నాయి. మధ్యమధ్యలో కొన్నిసార్లు ఇరు పార్టీల మధ్య విబేధాలు వస్తున్నప్పటికీ అనతికాలంలోనే అవి చెదిరిపోయి మళ్లీ స్నేహహస్తాన్ని చాటుకుంటాయి. కానీ, ఈసారి బీజేపీ కాస్త సీరియస్గానే నితీష్ను టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది.
2014లో మొదటిసారి నరేంద్రమోదీ నేతృత్వంలో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడ్డ ఏడాదికే అంటే 2015లో బీజేపీ నుంచి నితీష్ దూరం జరిగారు. లాలూ ప్రసాద్ యాదవ్తో చేతులు కలిపి ‘బిహారీ-బహారీ’ అనే నినాదంతో బీజేపీని నిలువరించారు. కానీ కొద్ది రోజులకే లాలూ కుమారుడు, అప్పటి ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్పై అవినీతి ఆరోపణలు రావడంతో పొత్తు తెంచుకుని మళ్లీ బీజేపీ పక్షాన చేరారు. అనంతరం 2019 సార్వత్రిక ఎన్నికలు, 2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమితోనే పోటీ చేశారు. ఈ ఎన్నికలకు ముందు నుంచే నితీష్కు బీజేపీకి చెడిందని విశ్లేషకులు అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో సగం సీట్లు కావాలని బీజేపీ చేసిన ప్రతిపాదనకు ఒప్పుకోనంటూ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ వైదొలగడం అప్పట్లో చర్చనీయాంశమైంది. పీకే నిష్క్రమణను నితీష్ అంతగా పట్టించుకోకుండా బీజేపీతో మైత్రి కొనసాగించారు.
కానీ, ఇప్పుడదే బీజేపీ నితీష్కు చాప కింద నీరులా మారినట్లు కనిపిస్తోంది. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో లోక్ జన్ శక్తి పార్టీని బీజేపీనే మ్యానేజ్ చేసి జేడీయూకి వ్యతిరేకంగా పోటీ చేయించిందనే విమర్శలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. బిహార్లో బీజేపీ ఎదుగుదలకు జేడీయూనే అడ్డంకిగా ఉందని కమల నేతలు భావించారని అందుకనే జేడీయూ టార్గెట్గా బీజేపీ అధిష్టానం పావులు కదుపుతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే రాష్ట్ర బీజేపీ నేతలు నితీష్పై ప్రభుత్వంపై తరుచూ విమర్శలు గుప్పిస్తున్నారట. పార్టీ సీనియర్ నేత సుశీల్ కుమార్ మోదీ సైతం ఆ మద్య నితీష్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఈయన గతంలో నితీష్ కేబినెట్లో ఉప ముఖ్యమంత్రిగా కూడా పని చేయడం ఇక్కడ మరో విశేషం. ఇక తాజాగా బీజేపీ ఎమ్మెల్యే వినయ్ బిహారీ విమర్శలు గుప్పించారు. అభివృద్ధి అంతా రాజ్గిర్లోనే ఆగిందని, అలా ఎందుకు జరుగుతోందో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలంటూ ఆయన నిలదీశారు.
నితీష్ ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్ల నాటి నుంచి ఆర్జేడీ నుంచి వచ్చే విమర్శల కంటే మిత్రపక్షం బీజేపీ నుంచి వస్తున్న విమర్శలతోనే నితీష్ సతమతమవుతున్నట్లు కనిపిస్తోంది. అసెంబ్లీకి జేడీయూకి తగినంత మెజారిటీ లేకపోవడం.. పైగా బీజేపీకి జేడీయూ కంటే ఎక్కువ స్థానాలు ఉండడం నితీష్ను నోరు మెదపకుండా చేస్తున్నాయట. ఇదిలా ఉంటే.. ఒకవైపు నితీష్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే మరొకవైపు బిహార్లో భారీ ఎత్తున ప్రచారాన్ని ప్రారంభించింది బీజేపీ. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి జేడీయూని ఒంటరిని చేసి ఎన్డీయే కూటమి నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థి బీజేపీ నుంచి నిలబెట్టేలా ప్రణాళికలు చేస్తున్నారట. గత ఎన్నికల్లో జేడీయూకి తక్కువ స్థానాలు వచ్చినప్పటికీ ముఖ్యమంత్రి స్థానాన్ని వదులుకున్న బీజేపీ.. ఈసారి ఎలాగైనా సరే కమల నేతనే సీఎంగా చూడాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు ప్రధాన అడ్డంకిగా నితీషే మారారని, అందుకే అతడిని టార్గెట్ చేసినట్లు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
China: చైనా నుంచి ముప్పు.. భారీ యుద్ధ విన్యాసాలు చేపట్టిన తైవాన్