Mittal (1)
Lakshmi Mittal: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో తగ్గేదేలేదని కేంద్రం ప్రకటించగా.. ప్రైవేటీకరణ అంశంలో కీలకంగా ముందడుగులు వేస్తోంది. ఇప్పటికే ప్రైవేటీకరణకు సంబంధించి ప్రక్రియ ప్రారంభం అవ్వగా.. మరోవైపు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వద్దని ఉద్యోగ సంఘాలన్నీ పోరుబాట పట్టాయి. ఈ క్రమంలోనే కొనుగోలు రేసులో లక్ష్మీ మిట్టల్ ఉన్నట్లుగా తెలుస్తోంది.
విశాఖ ఉక్కును సొంతం చేసుకునేందుకు టాటాతో సహా పలు కంపెనీలు ప్రయత్నాలు చేస్తుండగా.. ఈ రేసులోకి ప్రముఖ పారిశ్రమికవేత్త లక్ష్మీమిట్టల్ వచ్చారు. ప్రభుత్వ రంగ వైజాగ్ స్టీల్పై ప్రైవేట్ రంగ ఉక్కు దిగ్గజం AMNS ఇండియా సంస్థ ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. వైజాగ్ స్టీల్ కొనుగోలు అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఆ కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, కంపెనీ మాత్రం ఈ విషయం అధికారికంగా ధ్రువీకరించలేదు.
టాటా స్టీల్ సీఈవో టీవీ నరేంద్రన్ మాత్రం.. తూర్పు తీరంలో ఉన్న విశాఖ స్టీల్ కొనుగోలు చేస్తే ఆగ్నేయాసియా మార్కెట్లలోకి మరింత చొచ్చుకుపోయేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నట్లు వెల్లడించారు. వైజాగ్ స్టీల్లో 100 శాతం వాటాల విక్రయ ప్రతిపాదనకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ జనవరి 27వ తేదీన సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో AMNS మాతృ సంస్థ ఆర్సెలర్ మిట్టల్ చైర్మన్ లక్ష్మి నివాస్ మిట్టల్ భేటీ అవుతున్నట్లు AMNS ట్వీట్ చేసింది. అయితే, సమావేశ వివరాలను మాత్రం వెల్లడించలేదు.వైజాగ్ స్టీల్పై మిట్టల్ కంపెనీ దృష్టి పెట్టిందన్న వార్తలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. గుజరాత్లోని AMNS ఇండియాలో ఆర్సెలర్ మిట్టల్కు 60 శాతం, జపాన్కు చెందిన నిప్పన్ స్టీల్కు 40 శాతం వాటాలు ఉన్నాయి.