4 Babies Born : సాధారణ ప్రసవంతో నలుగురు ఆడపిల్లలకు జన్మనిచ్చిన మహిళ

కామెర్లు, రక్తహీనతతో బాధపడుతూ కూడా ఓ మహిళ నలుగురు ఆడపిల్లలకు జన్మనిచ్చింది.అదికూడా సాధారణ ప్రసవంతో. తల్లితో పాటు నలుగురు ఆడపిల్లలు క్షేమంగా ఉండటం విశేషం.

  • Published On : August 10, 2021 / 04:22 PM IST

Odisha Women

Jaundice, Anaemia women four Babies Gives Birth : ప్రసవం మహిళకు మరో జన్మ అంటారు. ఇంత టెక్నాలజీ ఉన్న ఈరోజుల్లో కూడా సాధాణం ప్రసవం సమయంలో మహిళ మరోజన్మ ఎత్తాల్సిందే బిడ్డను కనాలంటే. ఓ బిడ్డను ప్రసవించాలంటేనే పురిటినొప్పులు భరించక తప్పదు. అటువంటిది ఒకే కాన్పులో అదికూడా సాధారణ ప్రసవంతో ఓ మహిళ నలుగురు బిడ్డలకు జన్మనిచ్చింది. ప్రసవం అంటే 99 శాతం సిజేరియన్ ఆపరేషన్ల ద్వారానే జరిగే ఈ రోజుల్లో సాధారణ ప్రసవం అదికూడా నలుగురు బిడ్డలకు జన్మనివ్వటం అంటే మాటలు కాదు. ఆ తల్లి ఎంత ప్రసవవేదన అనుభవించి ఉంటుందో కదా.. పైగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ కూడా నలుగురు బిడ్డలను సాధారణ ప్రసవంతోనే కన్నది ఒడిశాలోని ఓ మహిళ.

ఒడిశాలోని గంజామ్ జిల్లాలోని బంజాన‌గ‌ర్ బ్లాక్‌లో ఉండే సారన్‌కుల్ గ్రామానికి చెందిన చాబి నాయ‌క్ నలుగురు ఆడపిల్లలను సాధారణ ప్రసవంతోనే జ‌న్మ‌నిచ్చింది. నిజానికి గ‌ర్భం దాల్చిన స‌మ‌యంలో ఆమె తీవ్ర‌మైన ఆరోగ్య సమ‌స్య‌ల‌తో ఇబ్బంది పడుతోంది. ఆమె కండీష‌న్ సీరియ‌స్‌గా ఉన్న క్రమంలో క‌ట‌క్‌లోని ఎస్సీబీ మెడిక‌ల్ కాలేజీలో జాయిన్ చేశారు. ఆమె అత్యంత బలహీనంగా ఉండటంతో డాక్టర్లు ఆమెకు పలు పరీక్షలు చేశారు.

ర‌క్త ప‌రీక్ష‌ల్లో ఆమెకు తీవ్ర‌మైన ర‌క్త‌హీన‌త‌, ప‌చ్చ కామెర్లు ఉన్న‌ాయని తేలింది. దీంతో ఆమెను అత్యంత జాగ్రత్తగా చూసుకున్నారు. గైన‌కాల‌జీ, హెమ‌టాల‌జీ, హెప్టాల‌జీ శాఖ‌లు.. తల్లితో పాటు కడుపులో ఉన్న నలుగురు బిడ్డలను అత్యంత జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉండేవారు. నిరంతరం ఆమె కండిషన్ చూసుకుంటుండేవారు.

అలా చాబి నాయ‌క్ న‌లుగురు అమ్మాయిల‌కు సాధారణ ప్రసవంతోనే జ‌న్మ‌నిచ్చింది. ఆరోగ్య‌ప‌రిస్థితి స‌రిగా లేకున్నా..న‌లుగురు పిల్ల‌ల‌ను నార్మ‌ల్ డెలివ‌రీ ప‌ద్ధ‌తిలో క‌న‌డం ఆశ్చ‌ర్య‌మే. ప్ర‌స్తుతం త‌ల్లితో పాటు న‌లుగురు పిల్ల‌లు కూడా క్షేమంగా ఉన్నారని డాక్టర్లు తెలిపారు.