true love : వృద్ధాప్యంలో దంపతుల మధ్య అనుబంధం మరింత పెరుగుతుంది. పిల్లలు పట్టించుకోకపోవడం కారణం కావచ్చు.. అనారోగ్య కారణాలు కావచ్చు.. చిన్న చిన్న పనులకు ఒకరిపై ఒకరు ఆధారపడుతుంటారు. అనారోగ్యంతో ఉన్న తన భార్యకు ఓ పెద్దాయన ఆప్యాయంగా ఆహారం తినిపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో విశేషం ఏం ఉంది అంటారా? చదవండి.
భార్యాభర్తల మధ్య అనుబంధం చాలా గొప్పది.. వయసులో ఉన్నప్పటి కంటే వృద్ధాప్యంలో వారికి ఒకరి తోడు ఒకరికి ఎంతో అవసరం. ఇటీవల కాలంలో చిన్న కుటుంబాలు.. పిల్లలు దూరంగా ఉండటాలతో చాలామంది పెద్దవాళ్లు వృద్ధాశ్రమాలకు పరిమితం అయిపోతున్నారు. సాధ్యమైనంత వరకూ పిల్లల మీద ఆధారపడి ఉండకూడదనే నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారు. ఏదో ఒక అనారోగ్య సమస్యతో సతమతమవుతూ అక్కడే తనువు చాలిస్తున్నారు. వయసు మీద పడ్డా ఒకరిపై ఒకరు ప్రేమ, ఆప్యాయతలతో నిండి దంపతుల్ని చూస్తే ముచ్చట అనిపిస్తుంది. విషయానికి వస్తే ఇండియన్ ఐడల్ రన్నరప్ రాకేష్ మైనీ తాను ట్రైన్ జర్నీ చేస్తున్నప్పుడు చూసిన ఓ అనుభవాన్ని షేర్ చేశాడు. ట్రైన్లో ఓ వృద్ధ జంట అనుబంధాన్ని చూసి ముచ్చటేసి అతను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
దంపతుల్లో పెద్దాయన అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్యకు ఎంతో ప్రేమతో చపాతీ తినిపిస్తాడు. ఆమెతో కబుర్లు చెబుతూ చపాతి నమిలి తినేవరకూ వేచి చూస్తాడు. ట్రైన్ లో ఆమె నిద్రపోయే వరకు అతను వెన్నంటే ఉన్న తీరు చాలా ఎమోషనల్ అనిపించిందని సింగర్ రాకేష్ పోస్ట్లో షేర్ చేసుకున్నాడు. ఇంత వయసులో కూడా ప్రేమ, ఆత్మీయతలు పంచుకోవడం అనేది నిజంగా అభినందనీయమని కొందరు.. ఈ వీడియో మనసుని కదిలించిందని కొందరు అభిప్రాయపడ్డారు.