Gold Price: ‘వన్ ఇండియా.. వన్ గోల్డ్ రేట్’ బంగారం ధరపై కేరళ కీలక నిర్ణయం.. దేశంలోనే తొలిరాష్ట్రంగా గుర్తింపు
భారతదేశంలో బ్యాంకు ధరల ఆధారంగా ఒకే విధమైన బంగారం ధరను ప్రారంభించిన మొదటి రాష్ట్రంగా కేరళ నిలిచింది. బంగారంకు రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లోని దుకాణాల్లో ఒకేధరల విధానాన్ని అమలు చేయాలని ఆల్ కేరళ గోల్డ్ అండ్ సిల్వర్ మర్చంట్స్ అసోసియేషన్ సభ్యులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
- Harishth Thanniru
- Published On : November 17, 2022 / 12:29 PM IST
Gold Price
Gold Price: భారతదేశంలో ‘వన్ ఇండియా, వన్ గోల్డ్ రేట్’ విధానాన్ని ప్రారంభించిన మొట్టమొదటి రాష్ట్రంగా కేరళ నిలిచింది. ఫలితంగా ఇప్పుడు రాష్ట్రంలో బ్యాంకు ధరల ఆధారంగా ఒకే రకమైన బంగారం ధరలు అందుబాటులోకి రానున్నాయి. 916 స్వచ్ఛత 22 క్యారెట్ల బంగారంపై కూడా ఇది వర్తిస్తుంది. అక్టోబరు, మార్చి మధ్య ఎక్కువగా పరిగణించబడే పెళ్లిళ్ల సీజన్లో బంగారం డిమాండ్ సాధారణంగా పెరుగుతుంది. ఈ క్రమంలో వన్ ఇండియా – వన్ గోల్డ్ రేట్ విధానాన్ని అమల్లోకి తేవడం ప్రాముఖ్యతను సంతరించుకుంది. దక్షిణ భారతదేశంలో దాదాపు 40 శాతం వాటా బంగారం విక్రయాలు కలిగి ఉంది. దానిలో మూడింట ఒక వంతు కేరళలోనే జరుగుతుండటం విశేషం.
ఉదాహరణకు బుధవారం బంగారం ధరలు అహ్మదాబాద్లో గ్రాముకు రూ.4,805, చెన్నైలో రూ.4,960, ఢిల్లీలో రూ.4,815, కేరళలో రూ.4,800గా ఉన్నాయి. కేరళలోని ప్రముఖ జ్యువెలరీ వ్యాపారులు తమ స్టోర్లలో ఒకే ధరను అనుసరించాయి. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్, జోయాలుక్కాస్, కళ్యాణ్ జ్యువెలర్స్ వంటి జ్యువెలర్స్ తమ దుకాణాలన్నింటికీ బ్యాంకులు కోట్ చేసిన బంగారం ధరనే వినియోగిస్తున్నారు. బ్యాంక్ రేట్లు సాధారణంగా మార్కెట్ ధరల కంటే రూ. 100 నుంచి రూ. 150 తక్కువగా ఉంటాయి. కస్టమర్లు సౌకర్యవంతంగా, పారదర్శకంగా ఉంటారని భావించినందున మేము ఒకేరేటును అందిస్తున్నామని జోయాలుక్కాస్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ టామ్ జోస్ తెలిపారు.
వాస్తవానికి, మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ‘వన్ ఇండియా వన్ గోల్డ్ రేట్’ని రెండు సంవత్సరాల ముందుగానే అక్టోబర్ 2020లో ప్రవేశపెట్టింది. మైక్రో మార్కెట్లలో రేట్ తేడాలు ఉన్నప్పటికీ దాని స్టోర్లలోని ఆభరణాలు ఒకే ధరకు అందుబాటులో ఉన్నాయి. మైక్రో మార్కెట్లలో బంగారం ధర కంటే ఈ రేటు తక్కువగా ఉన్నందున, కేరళలోని ఇతర ప్రముఖ ఆభరణాల వ్యాపారులు మార్కెట్లో పోటీగా ఉండేందుకు ధరను అనుసరించవలసి వచ్చింది. మలబార్ మాదిరిగానే, జోయాలుక్కాస్, కళ్యాణ్ జ్యువెలర్స్ కూడా దేశంలోని చాలా కీలకమైన బంగారు మార్కెట్లలో ఉనికిని కలిగి ఉన్నాయి. మలబార్ గోల్డ్కు భారతదేశంలో దాదాపు 200 దుకాణాలు ఉండగా, జోయాలుక్కాస్లో 85, కళ్యాణ్ జూవెల్స్ 120 షాపులు ఉన్నాయి. కేరళలో ప్రారంభమైన విధానం క్రమంగా దేశ ఆభరణాల మార్కెట్ ‘వన్ ఇండియా వన్ గోల్డ్ రేట్’ను స్వీకరించడానికి దారితీస్తుందని భావిస్తున్నారు.
