East Godavari: గుంపులుగా గుంపులుగా ప్రజలు.. ఆందోళన కలిగిస్తున్న వ్యాక్సినేషన్!
మొన్నటి వరకు వ్యాక్సిన్ వేయించుకోవాలని అధికారులు ప్రజలను బ్రతిమాలినా అపోహలతో అందరూ ముందుకురాలేదు. వ్యాక్సిన్ వేయించుకున్న సమయంలో స్వల్పంగా కనిపించే కొన్ని లక్షణాలతో చాలామంది ప్రజలు వ్యాక్సినేషన్ వద్దనే వద్దని మొరాయించారు.
- Naresh Mannam
- Updated on- June 23, 2021 / 04:31 PM IST
East Godavari
East Godavari: మొన్నటి వరకు వ్యాక్సిన్ వేయించుకోవాలని అధికారులు ప్రజలను బ్రతిమాలినా అపోహలతో అందరూ ముందుకురాలేదు. వ్యాక్సిన్ వేయించుకున్న సమయంలో స్వల్పంగా కనిపించే కొన్ని లక్షణాలతో చాలామంది ప్రజలు వ్యాక్సినేషన్ వద్దనే వద్దని మొరాయించారు. కానీ, ఇప్పుడు అదే వ్యాక్సిన్ కోసం ఎగబడుతున్నారు. ఒకపక్క రోజురోజుకూ కరోనా కేసులు ఉదృతమవుతుండగా వ్యాక్సిన్ పేరిట ప్రజలంతా ఒకేచోట గుమిగూడడం ఆందోళన కలిగిస్తుంది. ప్రస్తుతం వ్యాక్సిన్ కొరత నేపథ్యంలో వ్యాక్సిన్ వచ్చిందని తెలియగానే అందరూ ఒకేసారి ఎగబడడంతో పెద్ద ఎత్తున జనసమీకరణ ఏర్పడుతుంది.
East Godavari
ఆదివారం తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట ప్రభుత్వ కళాశాల వద్ద వ్యాక్సినేషన్ ఏర్పాటు చేశారు. దీంతో చుట్టుపక్కల ప్రజలంతా ఒక్కసారిగా వ్యాక్సినేషన్ కేంద్రం వద్దకు రావడంతో ఆందోళనకర పరిస్థితి ఏర్పడింది. భౌతిక దూరం పాటించకుండా జనం గుమిగూడిపోయి ఒకరినొకరు తోసుకుంటూ వ్యాక్సిన్ కోసం ప్రయత్నాలు చేశారు. అధికారులు ప్రజలను ఉద్దేశించి జాగ్రత్తలు చెప్తున్నా వారు పట్టించుకోవడంలేదు. అసలు ఇక్కడి పరిస్థితి చూస్తే అసలు ప్రజలు కరోనా నుండి రక్షణ పొందే వ్యాక్సిన్ కోసం వెళ్ళారా.. లేక కరోనా సోకడం కోసం వెళ్ళారా అనిపిస్తుంది.
ఒక్క కొత్తపేటలో మాత్రమే కాదు చాలాచోట్ల అదే పరిస్థితి నెలకొంటుంది. కరోనా కట్టడికి వ్యాక్సిన్ మాత్రమే పరిష్కారం అని వైద్యులు చెబుతుండడంతో ప్రజలు వ్యాక్సిన్ ను సంజీవనిగా భావిస్తున్నారు. వ్యాక్సిన్ వేస్తున్నారు అని తెలియగానే ఆసుపత్రుల వద్ద వాలిపోతున్నారు. అయితే ఈ ఆత్రంలో నిబంధనలు మర్చిపోయి వ్యాక్సిన్ కోసం ఎగబడుతున్నారు. ప్రజలకు అర్ధమయ్యేలా వివరించాల్సిన అధికారులేమో తమ బాధ్యత వ్యాక్సినేషన్ మాత్రమే అనేలా వారిపని వారు చేసుకుపోతున్నారు.
Read: Andhra-Odisha Boarder: సరిహద్దు బంద్.. రోడ్డునే తవ్వేసిన అధికారులు!
