మళ్లీ పెరిగిన పెట్రో ధరలు, హైదరాబాద్లో సెంచరీకి చేరువలో
- Naveen
- Published On : February 10, 2021 / 01:28 PM IST
Rising-petrol-and-diesel-prices
Petrol, diesel prices rise: పెట్రో ధరలు మండిపోతున్నాయి. రోజురోజుకి పెరిగిపోతూ వాహనదారులను బెంబేలెత్తిస్తున్నాయి. దేశంలో ఇంధన ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. వరుసగా రెండో రోజూ చమురు ధరలు పెరిగి కొత్త గరిష్టాలను తాకాయి. ఇవాళ(ఫిబ్రవరి 10,2021) లీటర్ పెట్రోల్ పై 30 పైసలు, లీటర్ డీజిల్ పై 25పైసలు చొప్పున పెంచినట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. దీంతో హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.91.09కి చేరింది. లీటర్ డీజిల్ ధర రూ.84.79గా ఉంది.
ఇక దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.87.60కి చేరింది. అలాగే, లీటరు డీజిల్ ధర రూ.77.73గా ఉంది. చెన్నైలో లీటరు పెట్రోలు ధర 26 పైసలు పెరిగి రూ.89.96కి చేరింది. అలాగే, డీజిల్ ధర లీటరుకి 24 పైసలు పెరిగి 82.90కి చేరింది. మిగతా నగరాలతో పోలిస్తే ముంబైలో పెట్రోల్ ధర అధికంగా ఉంది. అక్కడ లీటర్ పెట్రోల్ రూ.94.12, డీజిల్ ధర రూ.84.63కి చేరింది.
అంతర్జాతీయ, విదేశీ మారక ధరల ఆధారంగా దేశీయ చమురు సంస్థలు పెట్రో ధరలను రోజువారీగా సవరిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి తోడు చమురు పై ట్యాక్సులు పెంచడం ధరల పెరుగుదలకు మరో కారణం. ఇటీవల ప్రకటించిన బడ్జెట్ లో చమురు ధరలపై అగ్రిసెస్ విధించిన విషయం విదితమే.
