Sanitary Napkins: అబ్బాయిలకు శానిటరీ న్యాప్కిన్స్? బీహార్ స్కూల్లో వెలుగులోకి ఘటన
అబ్బాయిలకు శానిటరీ న్యాప్కిన్స్ పంపిణీ చేస్తున్నట్టు బీహార్ లోని ఓ ప్రభుత్వ పాఠశాల సిబ్బంది లెక్కలు చూపించడం అక్కడి అధికారులను విస్మయానికి గురిచేసింది.
- Bharath Reddy
- Published On : January 24, 2022 / 07:12 AM IST
Bihar
Sanitary Napkins: అబ్బాయిలకు శానిటరీ న్యాప్కిన్స్ పంపిణీ చేస్తున్నట్టు బీహార్ లోని ఓ ప్రభుత్వ పాఠశాల సిబ్బంది లెక్కలు చూపించడం అక్కడి అధికారులను విస్మయానికి గురిచేసింది. ఈఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. వివరాల్లోకి వెళితే..ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే బాలికలకు బీహార్ ప్రభుత్వం ఉచిత శానిటరీ న్యాప్కిన్స్ పంపిణీ చేస్తుంది. బాలికల చదువును ప్రోత్సహించేందుకు.. వారి తల్లిదండ్రులను ఒప్పించి.. రుతుక్రమం గురించి అపోహలు తొలగించి బాలికలు బడికి వచ్చేలా ఎంతో ప్రతిష్టాత్మకంగా బీహార్ ప్రభుత్వం ఇలా ఉచిత న్యాప్కిన్స్ అందిస్తుంది. పాఠశాలలో బాలికల సంఖ్యను బట్టి.. నెలకు సరిపడా న్యాప్కిన్స్ కొనుగోలు చేసేలా ఆయా పాఠశాలలకు డబ్బు పంపిణీ చేస్తారు ప్రభుత్వాధికారులు. అయితే ఇటువంటి పథకంలోనూ కొందరు చేతివాటం ప్రదర్శించడం విమర్శలకు తావిస్తుంది.
Also Read: Monkey Fever: కరోనా సమయంలో మరో పిడుగు: దేశంలో మరోసారి “మంకీ ఫీవర్” కలకలం
బీహార్ లోని శరన్ జిల్లా మాంఝీ బ్లాక్ వారిలో ఉన్న హల్ఖోరి షా హై స్కూల్లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పాఠశాలా ప్రధానోపాధ్యాయుడు ఇటీవల నిర్వహించిన రికార్డు తనిఖీల్లో ఈవిషయం వెలుగులోకి వచ్చింది. ఆడపిల్లలకు శానిటరీ న్యాప్కిన్స్ కింద అందిస్తున్న రూ.150లను.. పాఠశాల సిబ్బంది కొందరు అబ్బాయిలకూ ఇస్తున్నట్లు ప్రధానోపాధ్యాయుడు గుర్తించాడు. దీనిపై సిబ్బందిని విచారించగా 2016-17 సంవత్సరానికి గానూ ఒక్కో విద్యార్థికి(బాలురు) రూ.150 చొప్పున చెల్లించినట్లు రికార్డులో నమోదు చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఈ డబ్బును సదరు బాలురకు అందించారా? లేక సిబ్బంది చేతివాటం ప్రదర్శించారా? అనే విషయం తేలాల్సి ఉంది.
Also Read: Telangana Schools: రాష్ట్రంలో ఆన్ లైన్ తరగతులకు అనుమతి
ఇక ఈ ఘటనపై ప్రధానోపాధ్యాయుడి ఫిర్యాదు మేరకు..జిల్లా విద్యాశాఖ అధికారి అజయ్ కుమార్ సింగ్ విచారణకు ఆదేశించారు. సిబ్బంది ప్రమేయం ఉన్నట్లు తేలితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అజయ్ కుమార్ సింగ్ పేర్కొన్నారు. బీహార్ వ్యాప్తంగా ఈ పధకం కింద ఏడాదికి రూ.60 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. 2015 నుంచి ఎనిమిది నుంచి పదో తరగతి చదివే బాలికలకు ఉచితంగా శానిటరీ న్యాప్కిన్స్ పంపిణీ చేస్తున్నారు.
