Sirpurkar Commission : దిశ ఎన్కౌంటర్ ఘటనపై సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన సిర్పూర్కర్ కమీషన్ సభ్యులు ఈరోజు షాద్నగర్ సమీపంలోని ఘటనాస్ధలాన్ని సందర్శించారు. కమీషన్ సభ్యుల పర్యటనకు కేంద్ర బలగాలతో భద్రత కల్పించారు. కమిషన్ సభ్యులు భారీ భద్రత నడుమ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. 2019 డిసెంబరు 6వ తేదీన చటాన్పల్లిలో నలుగురు యువకులు ఎన్కౌంటర్లో మృతి చెందిన ఘటనపై కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా సుప్రీం కోర్టు కమిషన్ను ఏర్పాటు చేసింది.
Also Read : Shilpa Chowdary: శిల్పాచౌదరి కేసులో మరో కొత్త పేరు!
షాద్నగర్కు చేరుకున్న సిర్పూర్కర్ కమీషన్ సభ్యులు టోల్ గేట్ పరిసర ప్రాంతాలలో పర్యటించారు. ఎన్కౌంటర్ జరిగిన చటాన్పల్లికి చేరుకున్న కమిషన్ సభ్యులు ఘటన జరిగిన పరిసర ప్రాంతాలను పరిశీలించారు. దిశ మృత దేహాన్ని కాల్చి వేసిన బ్రిడ్జి ని కూడా సభ్యులు చూశారు. చటాన్పల్లి బ్రిడ్జి పరిసర ప్రాంతాలకు కమిషన్ సభ్యులు నేరుగా వెళ్లారు. కమిషన్ సభ్యులకు సిట్ అధికారి మహేష్ భగవత్ అన్ని ప్రాంతాలను దగ్గర ఉండి చూపించి వివరించారు. అనంతరం సభ్యులు షాద్ నగర్ పోలీసు స్టేషన్కు చేరుకున్నారు. ఎన్కౌంటర్పై విచారణ జరిపి ఫిబ్రవరి 2న కమీషన్ సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించనుంది.