Sonia Gandhi: పార్టీ నేతలతో నేడు సోనియా భేటీ.. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలపై చర్చ
పార్లమెంట్ ఉభయసభల్లో లేవనెత్తాల్సిన అంశాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చిస్తారు. కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీం, భారత్-చైనా సరిహద్దు వివాదం, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, వరద ప్రభావంతోపాటు అనేక రాష్ట్రాల్లో ఉన్న కీలక సమస్యలపై చర్చించనున్నారు.
- Narender Thiru
- Published On : July 14, 2022 / 08:03 AM IST
Sonia Gandhi
Sonia Gandhi: రాబోయే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా కాంగ్రెస్ అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ నేతలతో చర్చించనున్నారు ఆ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ. ఢిల్లీలోని సోనియా నివాసమైన 10 జన్పథ్లో ఈ సమావేశం జరిగనుంది. లోక్సభ, రాజ్యసభకు చెందిన కీలక నేతలు ఈ సమావేశానికి హాజరవుతారు. పార్టీ జనరల్ సెక్రటరీలు, పీసీసీ అధ్యక్షులు, ఇతర అనుబంధ సంఘాల నేతలకు ఆహ్వానం అందింది.
పార్లమెంట్ ఉభయసభల్లో లేవనెత్తాల్సిన అంశాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చిస్తారు. కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీం, భారత్-చైనా సరిహద్దు వివాదం, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, వరద ప్రభావంతోపాటు అనేక రాష్ట్రాల్లో ఉన్న కీలక సమస్యలపై చర్చించనున్నారు. వీటిని పార్లమెంట్లో లేవనెత్తి ప్రధాని మోదీ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది. మరోవైపు ఈ నెల 18న జరగనున్న రాష్ట్రపతి ఎన్నిక కోసం ఎంపీలంతా పార్లమెంట్కు తప్పనిసరిగా హాజరు కావాలని పార్టీ అధిష్టానం సూచించింది. త్వరలో రాహుల్ గాంధీ చేపట్టనున్న ‘భారత్ జోడో యాత్ర’ గురించి కూడా చర్చిస్తారు. ఈ నెల 21న నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి సోనియా గాంధీ.. ఈడీ ముందు హాజరుకావాల్సి ఉన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై కూడా చర్చ జరుగుతుంది.
Indian Couple: 45 పిస్టోళ్లు తీసుకెళ్తూ పట్టుబడిన ఇండియన్ జంట
గత నెలలో రాహుల్ గాంధీ.. ఈడీ ముందు హాజరైన సందర్భంగా కాంగ్రెస్ దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. ఈ సారి నిరసనలు మాత్రమే కాకుండా, ఈ అంశాన్ని పార్లమెంటులో కూడా లేవనెత్తాలని కాంగ్రెస్ భావిస్తోంది. ప్రతి పక్ష నేతలను ఇబ్బంది పెట్టేందుకే బీజేపీ ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతూ అధికారాన్ని దుర్వినియోగం చేస్తుందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. గుజరాత్లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల గురించి కూడా కాంగ్రెస్ అధిష్టానం చర్చించే అవకాశం ఉంది.
