National Herald case: రాహుల్ గాంధీని రెండో రౌండ్లో విచారిస్తోన్న ఈడీ.. మండిపడ్డ ఖర్గే
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని సోమవారం ఉదయం 11.40 నుంచి మధ్యాహ్నం 2.10 వరకు విచారించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సాయంత్రం 5 గంటల తర్వాత రెండో రౌండ్ విచారణ చేపట్టింది.
- T Venkateshwarlu
- Published On : June 13, 2022 / 05:51 PM IST
Rahul Gandhi
National Herald case: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని సోమవారం ఉదయం 11.40 నుంచి మధ్యాహ్నం 2.10 వరకు విచారించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సాయంత్రం 5 గంటల తర్వాత రెండో రౌండ్ విచారణ చేపట్టింది. నేషనల్ హెరాల్డ్ కేసులో ఆయనను ఈడీ అధికారులు విచారిస్తోన్న నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే మీడియాతో మాట్లాడుతూ… తాము సత్యాగ్రహం చేస్తున్నామని చెప్పారు. నేషనల్ హెరాల్డ్ అంశంలో నకిలీ కేసు పెట్టారని ఆయన అన్నారు.
సోనియా గాంధీ, రాహుల్ గాంధీని వేధించేందుకే వారిని ఈడీ కార్యాలయానికి రావాలని సమన్లు పంపారని ఆయన ఆరోపించారు. రాహుల్ను అన్ని గంటలు ఈడీ కార్యాలయంలో కూర్చోబెట్టడం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని ఆయన చెప్పారు. ఈ తీరును తాము ఖండిస్తున్నామని అన్నారు. ఈ కేసులో చట్టపర అంశం ఉండి ఉంటే చర్యలు తీసుకోవడానికి ఎనిమిదేళ్లు పట్టేది కాదని చెప్పారు. ఇది ప్రజలను హింసించడానికి వారి వద్ద ఉన్న పద్ధతి అని ఖర్గే విమర్శించారు. అయినప్పటికీ తాము భయపడబోమని అన్నారు. ప్రజల కోసం పోరాడుతూనే ఉంటామని తెలిపారు.
