Munugode ByElection Results: మునుగోడు ఉపపోరులో తప్పిన టీఆర్ఎస్ అంచనా.. మెజార్టీ తగ్గడానికి ప్రధాన కారణం వారేనా?
ఉపపోరులో కారును పోలిన గుర్తులు తమ అభ్యర్థి మెజార్టీకి గండికొట్టాయని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. ఈ విషయాన్ని ఫలితాల అనంతరం మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ప్రస్తావించారు.
- Harishth Thanniru
- Published On : November 7, 2022 / 07:58 AM IST
Munugode Bypoll
Munugode ByElection Results: మునుగోడు ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ముగిసింది. బీజేపీ, టీఆర్ఎస్ అభ్యర్థుల మధ్య నువ్వానేనా అన్నట్లుగా సాగిన పోరులో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సర్వీస్ ఓట్లతో కలిపి 10,399 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డికి 86,485 ఓట్లు రాగా, టీఆర్ఎస్ అభ్యర్థికి 96,598 ఓట్లు వచ్చాయి. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో టీఆర్ఎస్ పార్టీ అధిక్యాన్ని ప్రదర్శించింది. అయితే మెజార్టీ విషయంలో టీఆర్ఎస్ అధిష్టానం అంచనాలు తప్పినట్లే కనిపిస్తోంది. టీఆర్ఎస్ అధిష్టానం అంచనా ప్రకారం.. 15వేల నుంచి 20వేల ఓట్ల వరకు మెజార్టీ రావాల్సి ఉంది.
2014 ఎన్నికల్లో తెరాసకు మునుగోడులో 65,496 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పై 38,055 ఓట్ల మెజార్టీతో విజయం సాధించింది. 2018 ఎన్నికల్లో 74,687 ఓట్లు సాధించిన టీఆర్ఎస్ 22,552 ఓట్ల తేడాతో కాంగ్రెస్ పై ఓడిపోయింది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున గెలిచిన రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశాడు. 2018లో రాజగోపాల్ కు వచ్చిన ఓట్లలో చీలక వస్తుందని, కాంగ్రెస్, బీజేపీ పంచుకోగా టీఆర్ఎస్ కు 15 నుంచి 20వేల మధ్య మెజార్టీ వస్తుందని టీఆర్ఎస్ నేతల అంచనా. కానీ వారి అంచనాలు తప్పాయి. అనుకున్న మెజార్టీ పార్టీ అభ్యర్థికి రాలేదు. అయితే ఇందుకు ప్రధాన కారణం కారును పోలికన గుర్తులు, రెండో ఈవీఎంలో రెండు స్థానంలో ఉన్న గుర్తు కారణమని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఈ కారణంగా ఐదువేల మెజార్టీ తగ్గినట్లు అంచనా వేస్తున్నారు.
Munugode Bypoll Results: మరోసారి నిజమైన ఎగ్జిట్ పోల్స్.. ఏ సంస్థ ఏం చెప్పిందంటే..?
ఉపపోరులో కారును పోలిన గుర్తులు తమ అభ్యర్థి మెజార్టీకి గండికొట్టాయని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. ఈ విషయాన్ని ఫలితాల అనంతరం మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ప్రస్తావించారు. రోటీ మేకర్ గుర్తుపై పోటీ చేసిన అభ్యర్థికి 2,407 ఓట్లు పోలవగా, రోడ్డు రోలర్ గుర్తును పొందిన అభ్యర్థికి 1,874 ఓట్లు లభించాయి. ఇలా కారును పోలిన గుర్తులకు అధికంగానే ఓట్లు పోలయ్యాయి. మరోవైపు అభ్యర్థులు సంఖ్య ఎక్కువగా ఉండటంతో రెండు ఈవీఎంలను వినియోగించాల్సి వచ్చింది. దీంతో మొదటి ఈవీఎంలో రెండో నెంబర్లో టీఆర్ఎస్ గుర్తు ఉంది. అదేవిధంగా రెండో ఈవీఎంలో రెండో నెంబర్లో ఉన్న చెప్పు గుర్తుకు 2,270 ఓట్లు పోలయ్యాయి. చాలా మంది ఓటర్లు పొరబడి కారు గుర్తుకు బదులు చెప్పు గుర్తుకు వేసి ఉంటారని టీఆర్ఎస్ నేతలు పేర్కొంటున్నారు. ఇలా పలు కారణాలవల్ల టీఆర్ఎస్ దాదాపు 5వేల మెజార్టీని కోల్పోయిందని ఆ పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు.
