Udaipur incident: ఊహకు అందని ఘటన జరిగింది.. మోదీ, షా స్పందించాలి: రాజస్థాన్ సీఎం
రాజస్థాన్లోని ఉదయ్పూర్లో చోటుచేసుకుంటున్న హింసాత్మక ఘటనలపై ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా స్పందించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ అన్నారు.
- T Venkateshwarlu
- Updated on- June 28, 2022 / 09:37 PM IST
Ashok Gehlot
Udaipur incident: రాజస్థాన్లోని ఉదయ్పూర్లో చోటుచేసుకుంటున్న హింసాత్మక ఘటనలపై ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా స్పందించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ అన్నారు. ప్రజలు శాంతియుతంగా మెలగాలని మోదీ, అమిత్ షా వెంటనే ఓ సందేశం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఉదయ్పూర్లోని మల్దాస్ వీధిలో ఓ టైలర్ తలనరికి ఇద్దరు వ్యక్తులు హత్య చేయడం కలకలం రేపుతోన్న విషయం తెలిసిందే. అనంతరం ప్రధాని మోదీపై కూడా ఆ ఇద్దరు నిందితులు పలు వ్యాఖ్యలు చేస్తూ వీడియో విడుదల చేశారు.
prophet row: రాజస్థాన్లో తీవ్ర కలకలం.. హింసాత్మక ఘటనలు.. ఇంటర్నెట్ సేవల నిలిపివేత
ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీనిపై అశోక్ గహ్లోత్ మీడియాతో మాట్లాడుతూ… ”దేశం మొత్తం ఆందోళనకర వాతావరణం ఉంది. దీనిపై మోదీ, షా ఎందుకు మాట్లాడడం లేదు. ప్రజల్లో చాలా ఆందోళన నెలకొంది. హింసాత్మక ఘటనలను ఉపేక్షించబోమని మోదీ చెప్పాలి. యువత అవాంఛనీయ ఘటనలకు పాల్పడొద్దని ఆయన సందేశమివ్వాలి. ఉదయ్పూర్లో జరిగింది చిన్న ఘటన కాదు. ఊహకు అందని ఘటన జరిగింది. నేరస్థులు తప్పించుకోవడానికి వీల్లేదు” అని అశోక్ గహ్లోత్ అన్నారు. కాగా, హింసాత్మక ఘటనలు మరింత చెలరేగకుండా ఉదయ్ పూర్ లోని పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
