Raja Singh: గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన ప్రకటన చేశారు. గోషామహల్ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు. తను రాజీనామా చేస్తే అభివృద్ధి జరుగుతుందని నియోజకవర్గ ప్రజలు అంటున్నారని, నియోజకవర్గ అభివృద్ధికి సీఎం కేసీఆర్ నిధులు ప్రకటించిన వెంటనే రాజీనామా సమర్పిస్తానని రాజాసింగ్ తెలిపారు.
”గోషామహాల్ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే పదవిని వదులుకోవడానాకి సిద్ధంగా ఉన్నా. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయమని నియోజకవర్గ ప్రజలు నుంచి ఒత్తిడి వస్తోంది. సీఎం నిధులు ప్రకటించిన వెంటనే స్పీకర్ను కలిసి రాజీనామా లేఖ ఇస్తా. ఉపఎన్నిక వస్తే కేసీఆర్కు బడుగులు, రైతులపై ప్రేమ కలుగుతోంది” అని రాజాసింగ్ ఎద్దేవా చేశారు. ఎన్నికలు వస్తే తప్ప నిధులు కేటాయించడం లేదని ఆయన మండిపడ్డారు. ఒక్క హుజూరాబాద్ నియోజకవర్గంలోనే కాకుండా, గోషామహాల్ నియోజకవర్గంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సైతం పది లక్షలు ఇవ్వాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. అలా చేస్తే వెంటనే స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా పత్రాన్ని సమర్పిస్తానని రాజాసింగ్ స్పష్టం చేశారు.
హుజురాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక ఇతర నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారింది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో హుజురాబాద్ కు ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. ఈ బై పోల్ ను సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఆ నియోజకవర్గానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో, మిగిలిన నియోజకవర్గాల్లోనూ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలనే డిమాండ్లు వస్తున్నాయి.