Pawan kalyan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన సంపూర్ణ మద్యపాన నిషేధం హామీ ఏమైందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆయన ఇవాళ జనవాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ… మద్యపాన నిషేధం విధిస్తామని జగన్ చెప్పారని, ఇప్పుడు ప్రభుత్వమే నేరుగా మద్యం అమ్ముతోందని మండిపడ్డారు. మద్యం ద్వారానే ప్రభుత్వానికి రూ.30 వేల కోట్ల ఆదాయం వస్తుందని ఆయన చెప్పారు.
ప్రభుత్వం మద్యం ఆదాయాన్ని చూపుతూ రుణాలు తీసుకుంటోందని ఆయన అన్నారు. ప్రజల సమస్యలను వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని చెప్పారు. జగన్ చెప్పిన నవరత్నాలపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని ఆయన అన్నారు. వైసీపీ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని పవన్ ఆరోపించారు. భీమవరంలో డంపింగ్ యార్డు సమస్య పరిష్కారం కావట్లేదని అన్నారు. ఏపీలో ఇప్పటికీ బ్రిటిష్ కాలం నాటి బ్రిడ్జిలు ఉన్నాయని, కనీస మరమ్మతులు కూడా జిల్లాలో లేవని ఆయన చెప్పారు. 4 వేల రూపాయల విలువైన ఇసుక నేడు దాదాపు 36 వేల రూపాయల వరకు పలుకుతోందని చెప్పారు.
ఏపీలో టిడ్కో ఇల్లు, డ్వాక్రా మహిళల సమస్యలు, డంపింగ్ యార్డ్ సమస్యలు, త్రాగునీరు సమస్యలు జనసేన దృష్టికి వచ్చాయని పవన్ కల్యాణ్ తెలిపారు. అలాగే, ఉభయ గోదావరి జిల్లాల్లో డయాలసిస్ కేసులు చాలా పెరిగిపోతుండటం ఆందోళనకరమని అన్నారు. దీనికి కారణాలు తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రయత్నించాలని చెప్పారు. కాగా, జనవాణిలో నేడు 492 అర్జీలు వచ్చాయని, ముఖ్యంగా పంచాయతీ రాజ్, రోడ్లు, ఆర్థిక శాఖ, వైద్య శాఖ, ప్రభుత్వ పథకాల మీద ప్రజలు అర్జీలు సమర్పించారని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు.
Cloudburst: అందుకే సీఎం కేసీఆర్ ‘క్లౌడ్ బరస్ట్’ అన్నారు: ఉత్తమ్ కుమార్రెడ్డి