Akkineni Successors goes Viral with their Works in Akkineni 100 Years Events
Akkineni Family : నిన్న అక్కినేని నాగేశ్వరరావు 100వ జయంతి కావడంతో పలు వేడుకలు నిర్వహించారు. అక్కినేని ఫ్యామిలీ కూడా నిన్న ఉదయం అన్నపూర్ణ స్టూడియోస్ లో ఏఎన్నార్ 100వ జయంతి వేడుకలు, సాయంత్రం ఏఎన్నార్ ఫిలిం ఫెస్టివల్, పోస్టల్ స్టాంప్ రిలీజ్, ఏఎన్నార్ శతజయంతి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అనేకమంది సినీ, రాజకీయ ప్రముఖులు, పలువురు అభిమానులతో పాటు అక్కినేని ఫ్యామిలీ అంతా హాజరయ్యారు.
అయితే ఈ ఈవెంట్ లో అక్కినేని వారసులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నాగ చైతన్య, అఖిల్, సుమంత్, సుశాంత్, సుప్రియ.. ఇలా అక్కినేని మనవళ్లు, మనవరాళ్లు అంతా ఈవెంట్ కి హాజరవడం ఒక ఎత్తైతే స్టేజిపై అందరితో కూర్చునే స్థాయి ఉన్నా, మాట్లాడే ఛాన్స్ ఉన్నా కూడా స్టేజి పక్కన నిలబడి అన్ని పనులు చేసారు. అక్కడికి వచ్చిన పెద్దవాళ్ళను చేయి పట్టుకొని మరీ నడిపించారు, కుర్చీలు మోశారు, వాటర్ బాటిల్స్ అందించారు, ఈవెంట్ అయ్యేదాకా స్టేజి పక్కనే నిల్చొని ఉన్నారు, అక్కడికి వచ్చిన వాళ్ళని అందర్నీ పలకరిస్తూ, అక్కడి పెద్దవాళ్ళు ఏమన్నా అడిగితే అందిస్తూ ఉన్నారు.
ఏఎన్నార్ శతజయంతికి వచ్చిన చాలా మంది పెద్దలు, ప్రముఖులు కూడా ఏఎన్నార్ వారసులను అభినందించారు. ముఖ్యంగా నాగచైతన్య, అఖిల్, సుప్రియ, సుశాంత్, సుమంత్ లను మెచ్చుకున్నారు. నాగార్జున కూడా స్టేజిపైకి వచ్చిన వాళ్ళని దగ్గరుండి తీసుకెళ్లి కూర్చోపెట్టారు. ఇక సుప్రియ అయితే ఆ రోజంతా అన్ని పనులు తనపైనే వేసుకొని చేసింది. అక్కినేని వారసులు ఇలా స్టేజి పక్కనే నిల్చొని ఉన్న ఫొటోలు, వీడియోలు కొన్ని వైరల్ అవ్వడంతో ఇది కదా అక్కినేని వారసత్వం అంటే, ఇది కదా అక్కినేని వారి మర్యాద, మంచితనం అంటూ అభిమానులు, నెటిజన్లు అభినందిస్తున్నారు.
అక్కినేని వారసులు ఇంత వినమ్రతగా ఉండటం ఇదేమి మొదటిసారి కాదు గతంలో కూడా పలు అక్కినేని ఫ్యామిలీ ఈవెంట్స్, అన్నపూర్ణ స్టూడియో ఈవెంట్స్ లో అక్కినేని వారసులు చేసే మర్యాద, వారి మంచితనం, ముఖ్యంగా పెద్దవాళ్ళను గౌరవిస్తూ చేసే పనులు వైరల్ అయ్యాయి. ఎంతైనా అందంలోనూ, మంచితనంలోనూ అక్కినేని కుటుంబం తర్వాతే ఎవరైనా అని అంటున్నారు ఫ్యాన్స్.