Amala Akkineni : శర్వానంద్ హీరోగా అమల ముఖ్య పాత్రలో ఇటీవల వచ్చిన సినిమా ‘ఒకేఒక జీవితం’. ఈ సినిమాలో అమల శర్వాకి తలి పాత్రలో నటించింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో పాటు అమల పాత్రకి విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు వస్తున్నాయి. చాలా గ్యాప్ తర్వాత సినిమాలో నటించింది అమల. ఈ సినిమా చూసాక ప్రేక్షకులు, సెలబ్రిటీలు అంతా అమలని పొగిడేస్తున్నారు. తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్ లో అమల మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలని తెలిపింది.
ఎందుకని వరుసగా సినిమాల్లో నటించలేదు? మళ్ళీ సినిమాల్లో నటిస్తారా? అని అడగగా అమల సమాధానమిస్తూ.. ”లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా తర్వాత మలయాళంలో రెండు, హిందీలో మూడు సినిమాలు, ఒక వెబ్ సిరీస్ చేశాను. తెలుగులో ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ తర్వాత నేను చేసిన చిత్రం ఇదే. నేను గత అయిదేళ్లుగా ‘అన్నపూర్ణ ఫిల్మ్ అండ్ మీడియా’ని చూసుకుంటున్నాను. వందల మంది విద్యార్థుల భవిష్యత్ బాధ్యత నాపై ఉంది. నా సమయం వారికోసం కేటాయిస్తున్నాను. నేను వరుసగా సినిమాలు చేస్తే ఆ బాధ్యతలపై దృష్టి పెట్టలేను. అందుకే ఒకే ఒక జీవితం సినిమా లాంటి నా మనసుకు హత్తుకునే కథ, పాత్ర వస్తేనే నేను చేస్తాను” అని తెలిపింది.
ఇక నాగార్జున గారితో కలిసి సినిమా చేస్తారా అని అడగగా..”నాగార్జున, నేను ఎప్పుడూ ఇంట్లో కలిసే ఉంటాము. మళ్ళీ స్క్రీన్ పై వద్దు. ఆయనతో సినిమా చేసే ఉద్దేశం లేదు” అని అన్నారు.