బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ పేదలను వినూత్నంగా ఆదుకున్నారంటూ వీడియో వైరల్..
బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ పిండి ప్యాకెట్లలో నోట్లు పెట్టి పేద ప్రజలకు పంచారంటూ ఓ టిక్టాక్ వీడియో వైరల్ అవుతోంది. సినిమాను తలపించే ఈ వీడియోలో ఏముందంటే.. ఢిల్లీలో పేదలకు సాయం చేసేందుకు ఓ ట్రక్కు వీధి వీధికి తిరుగుతోంది. అందులో ఉన్నవాళ్లు కిలో గోధుమ పిండి ప్యాకెట్లను పేదలకు అందిస్తున్నారు. ఉత్తి పిండి ప్యాకెట్లకేనా ఇంత హడావిడి అనుకుంటూ చాలామంది వెనుదిరిగిపోయారు. కానీ కనీసం అది కూడా లేని నిరుపేదలు ముందుకొచ్చి ఆ ప్యాకెట్లను ఆదుర్దాగా అందుకున్నారు.
ఎంతో సంతోషంతో వాటిని తీసుకుని ఇంటికి వెళ్లి తెరిచి చూడగా అందులో పదిహేను వేల రూపాయలు కనిపించాయట. దీంతో వారి ఆనందానికి అవధుల్లేవు. దేవుడే ఇలా సాయం చేశాడని మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. అయితే ఈ ట్రక్ పంపించింది అమీర్ ఖానే అని, చేసింది చెప్పుకోవడం ఆయనకు ఇష్టముండదని.. మారుమూల నివసిస్తున్న పేదవారికి కూడా సాయమందించాలనే ఆయన ఇలా చేశారు అని అంటున్నారు ఆమిర్ అభిమానులు. అయితే ఆమిర్ మాత్రం ఇప్పటివరకు ఈ విషయంపై ఎలాంటి ప్రకటన చేయలేదు.