Ram Charan : టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల దేశంలోని పలు ప్రతిష్టాత్మకమైన సదస్సుల్లో ఫిలిం ఇండస్ట్రీ నుంచి పాల్గొంటూ అరుదైన గౌరవాలను దక్కించుకుంటున్నాడు. తాజాగా కశ్మీర్ – శ్రీనగర్ (Srinagar) లో జరుగుతున్న G20 సదస్సు 2023 లో చరణ్ పాల్గొన్నాడు. ఈ సదస్సులో 17 దేశాల నుంచి ఫిలిం టూరిజం ఆర్థికాభివృద్ధి, సాంస్కృతిక పరిరక్షణ పై చర్చలు జరపనున్నారు. ఇక మన దేశం తరుపు నుంచి రామ్ చరణ్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ సదస్సులో రామ్ చరణ్ కాశ్మీర్ అండ్ శ్రీనగర్ తో ఉన్న అనుబంధాన్ని తెలియజేశాడు.
రామ్ చరణ్ మాట్లాడుతూ.. “కాశ్మీర్ ఒక స్వర్గం లాంటి ప్రదేశం. 1986 నుంచి నా సమ్మర్ వెకేషన్స్ అని, మా నాన్నతో సినిమాలు అని ఇక్కడికి వస్తూనే ఉన్నాను. మా నాన్న (Chiranjeevi) కూడా సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తే. ఆయన సినిమాలు ఎన్నో ఇక్కడ గుల్మార్గ్, సోనామర్గ్ లో చిత్రీకరణ జరుపుకున్నాయి. అంతెందుకు ఇప్పుడు నేను కూర్చొని మాట్లాడుతున్న ఈ ఆడిటోరియంలో నేను 2016లో షూటింగ్ జరుపుకున్నాను. నా మూవీ ధృవ కోసం ఇక్కడ 95 డేస్ వర్క్ చేశాం. ఆ సినిమా ద్వారా మా ఆడియన్స్ కి కాశ్మీర్ ని మేము కొంత చూపించగలిగాం” అంటూ చెప్పుకొచ్చాడు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఇక ఇదే సమ్మిట్ లో సెంట్రల్ మినిస్టర్స్ కిషన్ రెడ్డి, జితేంద్ర సింగ్ కూడా పాల్గొన్నారు. సదస్సులో జితేంద్ర సింగ్ (Jitendra Singh) మాట్లాడుతూ.. ‘ఇక్కడికి ప్రజలు మమ్మల్ని చూడడనికి కాదు రామ్ చరణ్ ని చూడడానికే వచ్చారు’ అంటూ రామ్ చరణ్ పై ప్రశంసలు జల్లు కురిపించారు. కాగా జమ్మూ కశ్మీర్ (Jammu Kashmir) కు రాష్ట్ర హోదాను తొలగించిన తర్వాత అక్కడ జరుగుతున్న మొదటి అంతర్జాతీయ కార్యక్రమం కావడంతో.. అలాంటి ప్రతిష్టాత్మక సదస్సులో రామ్ చరణ్ కూడా భాగం అవ్వడంతో చరణ్ అభిమానులు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు.