Jr NTR : ఎన్టీఆర్ నాణెం విడుదల.. ఈ కార్యక్రమానికి కూడా జూనియర్ ఎన్టీఆర్ హాజరు అవ్వట్లేదు..?
నందమూరి తారక రామారావు(Nandamuri Taraka Ramarao) శతజయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం(Central Government) ముద్రించిన రూ. 100 స్మారక నాణేన్ని(100 Rupees Coin) రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నేడు సోమవారం విడుదల చేయనున్నారు.
- Saketh U
- Published On : August 28, 2023 / 10:56 AM IST
Jr NTR not Attending to Sr NTR 100 rupees coin releasing Program in Delhi
Jr NTR : తెలుగు ప్రజల ఆరాధ్య నటుడు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు(Nandamuri Taraka Ramarao) శతజయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం(Central Government) ముద్రించిన రూ. 100 స్మారక నాణేన్ని(100 Rupees Coin) రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నేడు సోమవారం విడుదల చేయనున్నారు. రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి టీడీపీ, బీజేపీ, పలు పార్టీల ప్రముఖులతో పాటు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు దాదాపు 200 మందికి ఆహ్వానాలు వెళ్లాయి.
ఇప్పటికే ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరితో పాటు నందమూరి బాలకృష్ణ కుటుంబ సభ్యులు కూడా ఢిల్లీకి చేరుకున్నారు. దాదాపు చాలా మంది టిడిపి ప్రముఖ నాయకులు, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. అయితే ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ హాజరు కావట్లేదని సమాచారం.
జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మాస్ సినిమా షూటింగ్ శరవేగంగా హైదరాబాద్ లో వేసిన సెట్స్ లో జరుగుతుంది. జూనియర్ ఎన్టీఆర్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉండటం వల్లే ఈ కార్యక్రమానికి వెళ్లలేకపోతున్నట్టు తెలుస్తుంది. అయితే గతంలో హైదరాబాద్ లో గ్రాండ్ గా సినీ, రాజకీయ ప్రముఖుల మధ్య జరిగిన ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు కూడా జూనియర్ ఎన్టీఆర్ హాజరు కాలేదు. అప్పట్లో దీనిపై అనేక కథనాలు వచ్చాయి. జూనియర్ ఎన్టీఆర్ పై విమర్శలు కూడా వచ్చాయి.
కాని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న ఎన్టీఆర్ 100 రూపాయల నాణెం విడుదల కార్యక్రమానికి కూడా జూనియర్ ఎన్టీఆర్ హాజరు కాకపోవడంతో ఎన్టీఆర్ అభిమానుల్లో, టీడీపీ కార్యకర్తల్లో చర్చగా మారింది. అయితే ఎన్టీఆర్ రాజకీయాలకు దూరంగా ఉండాలని నిశ్చయించుకున్న సంగతి తెలిసిందే. అందుకే రాజకీయ నాయకులు పాల్గొనే ఇలాంటి కార్యక్రమాలకు జూనియర్ ఎన్టీఆర్ దూరంగా ఉండాలనుకుంటున్నట్టు సమాచారం. కాని ప్రతుతం మాత్రం ముందు ఇచ్చిన కమిట్మెంట్స్ వల్లే దేవర షూటింగ్ ఉంది కాబట్టే వెళ్ళేలేకపోయాడని ఎన్టీఆర్ సన్నిహితులు అంటున్నారు.
ఇక ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా విడుదల చేస్తున్న 100 రూపాయల స్మారక నాణేన్ని 50శాతం వెండి, 40శాతం రాగి, ఐదు శాతం నికెల్, ఐదు శాతం జింక్ తో తయారు చేశారు. నాణేం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎన్టీఆర్ జీవిత విశేషాలతో 20 నిమిషాలపాటు వీడియో ప్రదర్శన ఇస్తారు. అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎన్టీఆర్ 100 రూపాయల స్మారక నాణేన్ని ప్రారంభిస్తారు.
