Jyothi Reddy : జూనియర్ ఆర్టిస్ట్ మృతి.. ఆస్పత్రి వద్ద కుటుంబ సభ్యుల ఆందోళన
మంగళవారం ఉదయం రైలు ప్రమాదంలో జూనియర్ ఆర్టిస్టు జ్యోతిరెడ్డి అనే యువతి మృతి చెందింది. షాద్నగర్ స్టేషన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఏపీలోని కడప జిల్లా చిట్వేన్ మండలానికి చెందిన.....
- Saketh U
- Published On : January 19, 2022 / 07:37 AM IST
Jyothi Reddy
Junior Artist Death : మంగళవారం ఉదయం రైలు ప్రమాదంలో జూనియర్ ఆర్టిస్టు జ్యోతిరెడ్డి అనే యువతి మృతి చెందింది. షాద్నగర్ స్టేషన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఏపీలోని కడప జిల్లా చిట్వేన్ మండలానికి చెందిన బట్టినపాత జ్యోతి హైదరాబాద్లో హెచ్డీఎఫ్సీ బ్యాంకులో ఉద్యోగిగా చేస్తుంది. దానితో పాటు సినిమాల్లోకి రావాలని జూనియర్ ఆర్టిస్ట్ గా చేస్తూ ప్రయత్నాలు కొనసాగిస్తోంది.
కేసు నమోదు చేసుకున్న పోలీసుల కథనం ప్రకారం.. సంక్రాంతి పండుగ సందర్భంగా స్వగ్రామానికి వెళ్లిన జ్యోతిరెడ్డి సోమవారం రాత్రి తిరుగు పయనమైంది. చిత్తూరు నుంచి కాచిగూడ వస్తున్న వెంకటాద్రి ఎక్స్ప్రెస్లో ఆమె రైల్వేకోడూరులో ఎక్కి హైదరాబాద్కు బయలుదేరింది. రైలు మంగళవారం తెల్లవారు జామున 5.30 గంటల ప్రాంతంలో షాద్నగర్ రైల్వే స్టేషన్లో ఆగింది. నిద్రమత్తులో ఉన్న జ్యోతిరెడ్డి కాచిగూడ రైల్వేస్టేషన్ అనుకొని షాద్నగర్ స్టేషన్లో దిగింది. అయితే వెంటనే తిరిగి రైలు ఎక్కేందుకు ప్రయత్నించగా అప్పటికే రైలు కదులుతుండటంతో ప్రమాదవశాత్తు ప్లాట్ఫాంపై పడిపోయింది. దీంతో ఆమె తలకు బలమైన గాయాలయ్యాయి. రైల్వే పోలీసులు ఆమెను చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే జ్యోతిరెడ్డి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
R Narayanamurthy : జగన్మోహన్ రెడ్డి వల్లే ‘బంగార్రాజు’ సక్సెస్ అయింది
జూనియర్ ఆర్టిస్ట్ జ్యోతిరెడ్డి మృతితో మలక్పేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి వద్ద ఆమె బంధువులు ఆందోళనకు దిగారు. చికిత్స నిమిత్తం ఆమెను మలక్పేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. దీంతో ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా మార్చురీకి తరలిస్తుండగా బంధువులు అభ్యంతరం చెబుతూ ఆస్పత్రి వద్ద ఆందోళన చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు.
