Kangana Ranaut : కరణ్ జోహార్ ఇక సినిమాలు తీయడం ఆపేయ్.. 250 కోట్లు వేస్ట్ చేశావ్.. కంగనా సంచలన కామెంట్స్..
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ అయితే దొరికినప్పుడల్లా కరణ్ జోహార్ పై విమర్శలు చేస్తూనే ఉంటుంది. తాజాగా రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహానీ సినిమా చూసిన కంగనా కరణ్ ని ఉద్దేశిస్తూ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది.
- Saketh U
- Published On : July 30, 2023 / 10:34 AM IST
Kangana Ranaut Sensational comments on Karan Johar and his Movies
Kangana Ranaut : బాలీవుడ్ అగ్ర దర్శక నిర్మాత కరణ్ జోహార్ చాలా సంవత్సరాల తర్వాత రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహానీ అనే సినిమాకి స్వయంగా దర్శకత్వం చేశారు. ఈ సినిమా జులై 28న రిలీజయింది. గతంలో కరణ్ జోహార్ చేసిన ప్రేమ కథల్లాగే ఇది కూడా ఉండటంతో యావరేజ్ టాక్ వచ్చింది. ఇక ఈ సినిమాకు దాదాపు 250 కోట్లు ఖర్చయిందని సమాచారం. కానీ రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహానీ సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా కేవలం 22 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. మన పవన్ బ్రో సినిమా దానికి డబల్ కలెక్షన్స్ చేయడం గమనార్హం.
కరణ్ జోహార్ ని బాలీవుడ్ మాఫియా అంటూ అనేకమంది విమర్శలు చేస్తూనే ఉంటారు. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ అయితే దొరికినప్పుడల్లా కరణ్ జోహార్ పై విమర్శలు చేస్తూనే ఉంటుంది. తాజాగా రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహానీ సినిమా చూసిన కంగనా కరణ్ ని ఉద్దేశిస్తూ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది. కరణ్ నువ్వు ఇకపై సినిమాలు తీయడం ఆపేయ్. గతంలో నువ్వు తీసిన సినిమాల్లోనుంచే కాపీ కొట్టి, మూడు గంటలు సీరియల్ తీస్తే జనాలు పిచ్చోళ్ళు అనుకున్నావా? 250 కోట్లు వేస్ట్ చేసావు. అంత డబ్బు అనవసరంగా వేస్ట్ చేశావు, అదే యంగ్ ఫిలిం మేకర్స్ కి ఇచ్చి ఉంటే మంచి సినిమాలు తీసేవాళ్ళు. నీ వల్ల సినిమా పరిశ్రమ సిగ్గు పడుతుంది. నువ్వు ఇంక రిటైర్ అయిపో అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.
దీంతో కంగనా రనౌత్ కరణ్ జోహార్ పై చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్ లో సంచలనంగా మారాయి. ఇక ఈ సినిమాలో రణవీర్ సింగ్ వేసిన బట్టలపై కూడా కామెంట్స్ చేస్తూ మంచి బట్టలు వేసుకో అంటూ పోస్ట్ చేసింది.
