Viswak Sen
యంగ్ హీరో విశ్వక్ సేన్ ‘లైలా’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేళ సీనియర్ నటుడు పృథ్వీరాజ్ చేసిన రాజకీయ కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి. దీంతో విశ్వక్ సేన్ ఇవాళ ప్రెస్మీట్ నిర్వహించి సారీ చెప్పాడు.
“చాలా కష్టపడి సినిమా తీశాం. ఆ వ్యక్తికి, నాకు ఏ సంబంధం లేదు. సారీ సార్. సినిమాకి సపోర్ట్ చేయండి. ఒక్కరి తప్పుకి 99 మందిని ఫెయిల్ చేయకండి. బాయికాట్ లైలా అని 25,000 మంది ట్రెండ్ చేశారు. హెచ్డీ ప్రింట్ ఆన్లైన్లో పెడతామని బెదిరిస్తున్నారు” అని విశ్వక్ సేన్ అన్నాడు.
“వాడి ఖాతాలో వీడు బలి” అంటూ, త్వరలోనే సినిమా హెచ్డీ ప్రింట్ రిలీజ్ చేస్తామని చాలా మంది ట్వీట్లు చేస్తున్నారని విశ్వక్ సేన్ ఆవేదన వ్యక్తం చేశాడు. తమ సినిమాను పైరసీ చేస్తామని అంటున్నారని, సినిమాలు చేసుకునే వారంటే చులకన అయిపోయారని చెప్పాడు. సినిమా కోసం చాలా కష్టపడ్డామని ఆయన తెలిపాడు.
అసలు ఆయన అటువంటి కామెంట్స్ చేస్తున్న సమయంలో అక్కడ తాను లేనని, చిరంజీవిని రిసీవ్ చేసుకోవడానికి వెళ్లానని చెప్పాడు. పృథ్వీరాజ్ వేదికపై ఏం మాట్లాడారో కూడా తమకు అప్పుడు తెలియదని అన్నాడు.
తాను ఇంటికి వెళ్లాక ఈ విషయం గురించి తెలిసిందని చెప్పారు. తమ నియంత్రణలోలేని విషయం గురించి తామేం చేయగలమని అన్నాడు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని దయచేసి తమ సినిమాని బలి చేయొద్దని కోరాడు.
మరోవైపు, లైలా మూవీ టీమ్ కూడా ఓ లేఖ విడుదల చేసింది. పృథ్వీరాజ్ చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని చెప్పింది. ఈ మూవీ టీమ్కి ఎలాంటి సంబంధం లేదని చెప్పింది.
పృథ్వీరాజ్ కామెంట్స్ ఇవే..
నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో పృథ్వీరాజ్ మాట్లాడారు. లైలా మూవీలో తానును మేకల సత్తి అనే పాత్ర చేశానని తెలిపారు. మూవీ మొదలైనప్పుడు మొత్తం 150 వరకు మేకలు ఉండేవని, అయితే, పూర్తయ్యే నాటికి 11 మేకలు అయ్యాయని చెప్పారు. ఈ విషయం యాదృచ్ఛికమో లేదంటే కాకతాళీయమోనని ఎద్దేవా చేశారు.