Pankaj Udhas : నేడు సంగీత ప్రియులు, సినిమా పరిశ్రమ ఒక బాధాకర వార్త వినాల్సి వచ్చింది. మ్యూజిక్ లెజెండ్ ‘పంకజ్ ఉదాస్’ నేడు కన్నుమూశారు. ఇండియన్ గజల్ అనే బిరుదుని సంపాదించుకున్న పంకజ్ ఉదాస్.. చిట్టి అయి హై, చండీ జై రంగ్ వంటి గజల్స్తో ఎంతో ప్రసిద్ధి చెందారు. కాగా కొన్నాళ్లుగా ఈయన.. అనారోగ్యంతో బాధపడుతూ వస్తున్నారు. ఇన్నాళ్లు చికిత్స పొందుతూ వచ్చిన పంకజ్ ఉదాస్.. నేడు 72 ఏళ్ల వయసులో మరణించారు.
ఆయన కుమార్తె నయాబ్ ఉదాస్ ఈ వార్తను సోషల్ మీడియా ద్వారా తెలియజేసారు. “ఈ విషయాన్ని తెలియజేయడానికి ఎంతో బాధాకరంగా ఉంది. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధ పడుతున్న పంకజ్ ఉదాస్ ఫిబ్రవరి 26న కన్నుమూశారు” అంటూ చెప్పుకొచ్చారు. ఈ వార్తతో ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు దిగ్బ్రాంతి చెందారు. ఆయనకి సంతాపం తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు వేస్తున్నారు.
Also read : ఫ్రెండ్ ఫంక్షన్లో నమ్రతా శిరోద్కర్, ప్రణతి సందడి.. ఫొటోలు వైరల్..
కాగా పంకజ్ ఉదాస్ హిందీ సినిమా మరియు భారతీయ పాప్ సంగీతానికి అందించిన సేవలతో ఎంతో ప్రసిద్ధి చెందారు. 1980లో తన గజల్ ఆల్బమ్ “ఆహత్”తో ఎంతో పేరుని, గుర్తింపుని సంపాదించుకున్నారు. ఆ తరువాత ముకరర్, తర్రన్నమ్, మెహ్ఫిల్ వంటి హిట్లతో ఆడియన్స్ ని అలరిస్తూ వచ్చారు. ఇక ‘నామ్’ మూవీలోని ‘చిట్టి ఆయీ హై’ పాట అయితే విపరీతమైన ప్రజాదరణ పొందింది. సంగీత ప్రపంచానికి ఆయన చేసిన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం.. 2006లో పద్మశ్రీతో గౌరవించింది.