Bollywood Drugs Case – Rakul Preet, Deepika Padukone: ఓ వైపు కరోనా కల్లోలం మరోవైపు సినిమా పరిశ్రమలో డ్రగ్స్ కలకలం.. యువనటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసు అనేక మలుపులు తిరిగి డ్రగ్స్ వ్యవహారం దగ్గర ఆగింది. దీంతో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) రంగంలోకి దిగి వేగంగా దర్యాప్తు చేస్తోంది.
ఇంతలో బాలీవుడ్ హీరోయిన్లు దీపికా పదుకొనే, శ్రద్ధా కపూర్, సారా అలీఖాన్, రకుల్ ప్రీత్ సింగ్కు ఎన్సీబీ తాజాగా సమన్లు అందించింది. రకుల్, శ్రద్ధా, సారాలను గురువారం, దీపికను శుక్రవారం విచారణకు రావాల్సిందిగా ఆదేశించింది.
కాగా నేడు శృతి మోడీ, ఖంబట్టా సైమోన్ విచారణకు హాజరయ్యారు. ఇంతకుముందు మాటమార్చిన రకుల్ ప్రీత్ ఎట్టకేలకు తనకు ఎన్సీబీ నోటీసులు అందాయని ఒప్పుకుంది. హైదరాబాద్ లో ఉన్న ఆమె రేపు విచారణకు హాజరుకానున్నట్లు వెల్లడించింది.
రేపు(శుక్రవారం) రకుల్, దీపికా ఇద్దరు ఎన్సీబీ ఎదుట హాజరుకానున్నారు. 15/20, 16/ 20 ఎఫ్ఐఆర్ కింద దీపక, రకుల్ ను విచారించనున్నారు. ఎన్సీబీ విచారణ కోసం దీపిక పూర్తిగా సన్నద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే న్యాయ నిపుణులను సంప్రదించిన దీపిక సుమారు 12 మంది లాయర్లతో ఎలాంటి న్యాయ పరమైన చర్యలు ఎదుర్కోవడానికైనా సిద్ధమైనట్లు సమాచారం.
అలాగే ఎల్లుండి (సెప్టెంబర్ 26 శనివారం) శ్రద్ధా కపూర్, సారా అలీ ఖాన్ లను విచారించనుంది ఎన్సీబీ. వీరి విచారణతో డ్రగ్స్ కేసులో కొత్త విషయాలు బయటకొచ్చే అవకాశముందని ఎన్సీబీ భావిస్తోంది.