Stuntman Raju Death: ప్రముఖ స్టంట్ మాస్టర్ రాజు మృతి.. పోలీసులు సీరియస్.. డైరెక్టర్ పా రంజిత్ పై కేసు నమోదు

ప్రాథమిక దర్యాప్తు ఆధారంగా నిర్లక్ష్యం కేసు నమోదు చేశామని పోలీసు అధికారి తెలిపారు.

Stuntman Raju Death: ప్రముఖ స్టంట్ మ్యాన్ ఎస్ఎం రాజు మూవీ షూటింగ్ లో ప్రమాదం జరిగి మరణించిన సంగతి తెలిసిందే. హై రిస్క్ కార్ స్టంట్ చేస్తూ రాజు చనిపోయారు. హీరో ఆర్య మూవీ షూటింగ్ లో ఈ విషాదం చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి డైరెక్టర్ పా రంజిత్ పై కేసు నమోదైంది. నిర్లక్ష్యం వల్లే స్టంట్ మాస్టర్ రాజు చనిపోయారని ఆరోపిస్తూ సినిమా డైరెక్టర్ పా రంజిత్, మరో ముగ్గురిపై కీజాయూర్ పోలీసులు కేసు నమోదు చేశారు.

సినిమా షూటింగ్ లో కారు స్టంట్ చేస్తుండగా కారు బోల్తా పడి ప్రఖ్యాత స్టంట్‌ మ్యాన్ ఎస్ఎం రాజు మరణించిన ఒక రోజు తర్వాత, దర్శకుడు పా రంజిత్ మరో ముగ్గురిపై నిర్లక్ష్యం కేసు నమోదైంది. సంఘటన జరిగిన సమయంలో రాజు తల లోపల రక్తస్రావంతో పాటు తీవ్రమైన అంతర్గత గాయాలకు గురయ్యాడని, ఆ సమయంలో బాహ్య గాయాలు కనిపించలేదని పోస్ట్‌మార్టం నివేదిక వెల్లడించింది.

దర్శకుడు పా రంజిత్, అసిస్టెంట్ డైరెక్టర్ రాజ్ కమల్, వాహన యజమాని ప్రకాష్, షూట్ మేనేజర్ వినోద్‌లపై కేసు నమోదు చేసినట్లు సీనియర్ పోలీసు ధృవీకరించారు. “పోస్ట్‌మార్టంలో అంతర్గత గాయం, తలలో రక్తస్రావం జరిగినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రాథమిక దర్యాప్తు ఆధారంగా, మేము నిర్లక్ష్యం కేసు నమోదు చేశాము” అని నాగపట్నం పోలీసు అధికారి తెలిపారు.

రంజిత్ దర్శకత్వం వహిస్తున్న సినిమా కోసం రాజు నాగపట్నం జిల్లాలో హై-రిస్క్ స్టంట్ చేస్తున్నాడు. రాజు వాహనం ర్యాంప్‌పై వేగాన్ని పెంచుతూ గాలిలో పల్టీలు కొడుతుండగా, మరొక వాహనం నేలపై వేగంగా దూసుకుపోతున్నట్లు వీడియోలో ఉంది.

రాజుకు మొదట్లో ఎలాంటి గాయాలు లేకపోయినా, కాసేపటికే కుప్పకూలిపోయాడు. స్థానిక ఆసుపత్రికి తరలించేలోపే అతడు మరణించాడు. అతని మరణం చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. మరోసారి స్టంట్ కళాకారుల భద్రతపై ప్రశ్నలు తలెత్తాయి.

స్టంట్ కొరియోగ్రాఫర్ ధిలీప్ సుబ్బరాయన్ స్టంట్ చేయవద్దని రాజుకు స్పష్టంగా చెప్పాడని, కానీ రాజు స్వయంగా దానిని ప్రదర్శించాలని పట్టుబట్టాడని హీరో విశాల్ తెలిపారు.ఇది స్టంట్ కళాకారుల అంకితభావానికి నిదర్శనం అన్నారు. “స్టంట్ ఆర్టిస్టులు తరచుగా తమ గాయాలను బయటపెట్టరు. ఎందుకంటే మరుసటి రోజు తిరిగి పనికి పిలవరేమోనని వారు భయపడుతున్నారు” అని ఆయన అన్నారు. “నా కెరీర్‌లో స్టంట్ల కారణంగా 116 కుట్లు” అని విశాల్ తెలిపారు.

భద్రత పట్ల పరిశ్రమ నిబద్ధతను ఆయన సమర్థించారు. అన్ని ప్రామాణిక ప్రోటోకాల్‌లను పాటిస్తున్నామని చెప్పారు. “సెట్‌లో అంబులెన్స్, డాక్టర్, నర్సు, ఫిజియో ఉన్నారు. షెల్ కూలిపోకుండా ఉండటానికి స్టంట్ కారును రాక్ సాలిడ్ పైపులతో మోడిఫై చేశారు. హెల్మెట్‌లు, ప్యాడెడ్ సూట్‌లు, సీటు బెల్టులను తప్పనిసరిగా ఉపయోగించడం అవసరం” అని విశాల్ చెప్పారు.