Live : ‘సిరివెన్నెల’ ఇకలేరు.. సినీ, రాజకీయ ప్రముఖుల సంతాపం

తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది.. ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అనారోగ్యంతో కన్నుమూశారు..

  • Updated on- November 30, 2021 / 10:00 PM IST

Sirivennela Sitaramasastri Passes Away

Sirivennela Sitaramasastri: తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన వయసు 66 సంవత్సరాలు. సిరివెన్నెలకు భార్య పద్మావతి, ఇద్దరు కుమారులు రాజా, యోగేష్ ఉన్నారు. న్యుమోనియాతో బాధపడుతున్న సీతారామాశాస్త్రిని నవంబర్ 24న కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు.

ఐసీయూలో ఆయనకు చికిత్సనిందించారు వైద్యులు. ఎంత ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోవడంతో మంగళవారం సీతారామ శాస్త్రి తుదిశ్వాస విడిచారు. తన కలం బలంతో తెలుగు సినీ సాహిత్యాన్ని కొత్తపుంతలు తొక్కించారు సీతారామ శాస్త్రి.

ఎన్నో అద్భుతమైన పాటలు రాసి పాట స్థాయిని పెంచారు. తన పాటలతో సమాజంలో చైతన్యాన్ని తీసుకొచ్చారు. నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అంటూ భ్రష్టు పట్టిపోయిన వ్యవస్థను ప్రశ్నించారు. తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ వేసుకున్న సీతారామ శాస్త్రి అకాలమరణంతో తెలుగు చిత్ర పరిశ్రమ, సాహిత్య, సంగీత ప్రియులు, ఆయన అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.

సిరివెన్నెల మృతిపట్ల సినీ, రాజకీయ ప్రముఖులంతా తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.