‘ఆచార్య’ షూటింగ్ పున:ప్రారంభం..

  • Publish Date - November 12, 2020 / 05:52 PM IST

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కలయికలో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ ఫిలిం..‘ఆచార్య’.. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఇప్పటివరకు కొంతభాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఆచార్య లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడింది. త్వరలో తిరిగి ప్రారంభమవుతోంది అనుకునేలోగా చిరు కరోనా బారిన పడడంతో అంతా ఆందోళన చెందారు.

చిరు పూర్తిగా కోలుకునే వరకు షూటింగ్ ప్రారంభం కాదు.. వచ్చే వేసవిలో విడుదల సాధ్యం కాదు.. చాలా ఆలస్యం అయిపోతుంది.. అంటూ కంగారు పడ్డారు సినీ జనాలు..

కట్ చేస్తే.. తాజాగా ‘ఆచార్య’ షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ జరుపుతున్నామని.. ప్లాన్ ప్రకారం ఈ షెడ్యూల్‌ పూర్తి చేయడానికి టీం అంతా సిద్ధపడ్డామని తెలియచేశారు.

ప్రస్తుతం ఇతర నటీనటులపై సీన్స్ షూట్ చేస్తున్నారు. త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో చిరు ‘ఆచార్య’ సెట్స్‌లోకి అడుగుపెట్టనున్నారు. ఆయన సరసన కాజల్ అగర్వాల్ కథానాయికగా నటించనుండగా.. మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ కీలకపాత్రలో కనిపించనున్నారు.