Tollywood Drug Case : ఈడీ ఎదుట హీరో తనీష్, డ్రగ్స్ పార్టీల్లో పాల్గొన్నారా ?
: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది. పూరీ నుంచి ముమైత్ ఖాన్ వరకు విచారించిన అధికారులు.. ఇవాళ హీరో తనీష్ను విచారించనున్నారు.
- madhu
- Published On : September 17, 2021 / 07:03 AM IST
Tanish
Telugu Actor Tanish : టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది. పూరీ నుంచి ముమైత్ ఖాన్ వరకు విచారించిన అధికారులు.. 2021, సెప్టెంబర్ 17వ తేదీ శుక్రవారం హీరో తనీష్ను విచారించనున్నారు. గతంలోనూ ఆయనను ఎక్సైజ్ శాఖ అధికారులు విచారించారు. ఇప్పుడు వాటి వివరాల ఆధారంగా ఈడీ దర్యాప్తు జరపనుంది. డ్రగ్స్ కేసు నిందితులు కెల్విన్, జిషాన్తో తనీష్కు ఉన్న సంబంధాలపై ఈడీ అధికారులు ఆరా తీయనున్నారు. అలాగే ఎఫ్ లాంజ్ క్లబ్ పబ్లో జరిగిన డ్రగ్స్ పార్టీల్లో తనీష్ పాల్గొన్నారా..? అనే విషయాలపైనా ఈడీ వివరాలు రాబట్టనుంది.
Read More : Tollywood Drug Case : నవదీప్ 10 గంటలు విచారణ, ఏం చెప్పారో
ఇక డ్రగ్స్ కొనుగోలుకు తనీష్ ఏమైనా డబ్బులు ఇచ్చారా…. కెల్విన్తో లావాదేవీలు జరిపారా? అన్న కోణంలో ఈడీ విచారణ జరపనుంది. ఇందుకు సంబంధించి తనీష్ బ్యాంకు అకౌంట్లను పరిశీలించనుంది. గతంలో తనీష్ జరిపిన లావాదేవీల లెక్కలపై ఆరా తీయనుంది. అలాగే మనీలాండరింగ్, ఫెమా నిబంధనల ఉల్లంఘనలపైనా తనీష్ను ప్రశ్నించనున్నారు ఈడీ అధికారులు. డ్రగ్స్ కేసుకు.. తనకూ ఎలాంటి సంబంధం లేదంటున్నారు హీరో తనీష్. గతంలోనూ ఎక్సైజ్ శాఖ అధికారుల విచారణలో ఇదే చెప్పానన్నారు. ఈడీ నోటీసుల ప్రకారం బ్యాంకు స్టేట్మెంట్లతో హాజరవుతానని చెప్పారు.
Read More : Tollywood Drugs Case : ఈడీ విచారణకు రానా హాజరు..ఆ విషయాలే కీలకం
మరోవైపు…టాలీవుడ్ డ్రగ్స్ కేసులో తెలంగాణ ఎక్సైజ్ శాఖ కౌంటర్ దాఖలు చేసింది. తెలంగాణ హైకోర్టులో ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. రేవంత్రెడ్డి పిటిషన్లో ఈడీ మధ్యంతర దరఖాస్తు కొట్టివేయాలని కోరింది ఎక్సైజ్ శాఖ. డ్రగ్స్ కేసులపై వివిధ కోర్టుల్లో పన్నెండు చార్జ్ షీట్లు దాఖలు చేశామని.. ఎఫ్ఐఆర్లు, రిమాండ్ నివేదికలు, చార్జ్ షీట్లన్నీ ఈడీకి ఇచ్చామని ఎక్సైజ్ శాఖ కోర్టుకు తెలిపింది. ఈడీ కోరుతున్న వాంగ్మూలాలు, డిజిటల్ సాక్ష్యాలు తమ వద్ద లేవని.. వాంగ్మూలాలు, డిజిటల్ సాక్ష్యాలన్నీ కోర్టులకు సమర్పించామని చెబుతోంది ఎక్సైజ్ శాఖ.
