Tiger Population 2021: భారత్ లో ఆందోళనకర స్థాయిలో పెద్ద పులుల మృత్యువాత
భారత్ లో పెద్ద పులుల మరణాలు ఆందోళనకర స్థాయిలో ఉన్నాయి. 2021లో దేశ వ్యాప్తంగా ఉన్న అభయారణ్యాల్లో 126 పెద్ద పులులు మృత్యువాత పడ్డాయి.
- Bharath Reddy
- Published On : December 30, 2021 / 07:17 PM IST
Tiger Died
Tiger Population 2021: భారత్ లో పెద్ద పులుల మరణాలు ఆందోళనకర స్థాయిలో ఉన్నాయి. 2021లో దేశ వ్యాప్తంగా ఉన్న అభయారణ్యాల్లో 126 పెద్ద పులులు మృత్యువాత పడ్డాయి. ప్రపంచంలోనే 75 శాతం పులులున్న మన దేశంలో, సంఖ్యా పరంగా ఇన్ని పెద్ద పులులు మృత్యువాత పడడం మామూలు విషయం కాదు. కేంద్ర ప్రభుత్వం పులుల సంరక్షణ కొరకు దేశంలోని 19 రాష్ట్రాలకు భారీగా నిధులు అందించింది. అంతరించిపోతున్న జంతుజాలంలో పులులు అగ్రస్థానంలో ఉండగా.. జాతీయ జంతువుగా పులుల్ని సంరక్షించాల్సిన బాధ్యత భారత ప్రభుత్వం తీసుకుంది. దీంతో 2014కి ముందు 2,226గా ఉన్న పులుల సంఖ్య, 2018 నాటికి 2,967కి చేరింది. వీటిలో మధ్యప్రదేశ్ లో అత్యధికంగా 526 పులులు ఉండగా.. కర్ణాటకలో 524, ఉత్తరాఖండ్ లో 444 పులులు ఉన్నాయి. మరికొన్ని పులులు తెలంగాణ, మహారాష్ట్ర మరియు ఇతర రాష్ట్రాల పరిధిలోని పులుల అభయారణ్యాల్లో ఉన్నాయి.
అయితే గత రెండు సంవత్సరాలుగా భారత్ లో పులులు మృత్యువాత పడుతున్నాయి. 2020లో 106 పులులు మృతి చెందగా.. 2021లో ఆ సంఖ్య 126కి చేరింది. పులుల మృతిపై నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (NTCA) ఆందోళన వ్యక్తం చేసింది. 2012 నుంచి దేశంలో పులుల గణనను చేపడుతున్న NTCA, ప్రస్తుత పులుల మరణాలు వెలుగులోకి వచ్చిన లెక్కలేనని, వెలుగులోకి రాకుండా అడవి లోపల ఇంకా పులులు మృత్యువాత పడిఉంటాయని పేర్కొంది. 2021లో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక పులులు మృతి చెందగా, మహారాష్ట్రలో 26, కర్ణాటకలో 15 పులులు మృతి చెందాయి.
Also read: Android Update: త్వరలో ఈ ఫోన్ లకు ఆండ్రాయిడ్ 12 OS అప్డేట్
పులులు ఎందుకు మృత్యువాత పడుతున్నాయి అనే విషయంపై అటవీశాఖ అధికారులు, వన్యప్రాణి సంరక్షకులు అధ్యయనం చేస్తున్నారు. పులులు మృతికి నిర్దిష్టమైన కారణం లేకపోయింది. 2018కి ముందు వరకు వేటగాళ్ల భారినపడి ఎక్కువగా పులులు మృతి చెందేవి. అయితే ప్రభుత్వం కఠిన చట్టాలు తేవడంతో పులుల వేట కూడా తగ్గింది. ఈక్రమంలో NTCA తెలిపిన వివరాల ప్రకారం ఇటీవల మృతి చెందిన 65 పులులు టైగర్ రిజర్వు ఫారెస్టుల్లోనే జరిగింది. మృత్యువాత పడిన పులుల్లో సగానికి సగం సహజసిద్ధంగానే మృతి చెందుతున్నాయని, పలుమార్లు గ్రామాల్లోకి వచ్చిన పులులను మనుషులు చంపడం జరిగిందని NTCA పేర్కొంది. ఇక పులి భారిన పడి మనుషులు మృతి చెందిన ఘటనలు కూడా 2021లో ఎక్కువగా చోటుచేసుకున్నాయి. 2020లో దేశ వ్యాప్తంగా 44 మంది పులి భారిన పడి మృతి చెందగా, 2021లో ఆ సంఖ్యా రెట్టింపై.. 80 మంది పులి కోరల్లో చిక్కుకుని మృత్యువాత పడ్డారు. ఏదేమైనా మునుషులతో పాటు సమానంగా భూమిపై జీవించే హక్కున్న పులులను సంరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ప్రజలపై ఉందని జంతు ప్రేమికులు అంటున్నారు.
Also read: South Cinemas Box office: ఇండియన్ బాక్సాఫీస్ ను కొల్లగొట్టిన టాప్ దక్షిణాది చిత్రాలు
