సార్వత్రిక ఎన్నికల్లో 4వ దశ పోలింగ్ ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటి వరకు 3దశల్లో పోలింగ్ పూర్తయింది. సోమవారం 29 ఏప్రిల్ 2019న 4వ దశలో 9 రాష్ట్రాల్లోని 71 పార్లమెంట్ స్ధానాలకు పోలింగ్ జరుగుతుంది. మహారాష్ట్రలో 17 స్థానాలు, రాజస్థాన్లో 13, ఉత్తరప్రదేశ్లో 13, బెంగాల్లో 8, మధ్యప్రదేశ్లో 6, ఒడిశాలో 6, బీహార్లో 5, జార్ఖండ్లో 3, జమ్మూకాశ్మీర్ లో ఒక స్థానానికి పోలింగ్ జరగబోతోంది. వీటితోపాటు ఒడిశాలోని 42 అసెంబ్లీ స్థానాలకు కూడా నాలుగో దశలో ఎన్నికలు జరగనున్నాయి.
నాలుగో దశలో లక్షా 40వేల పోలింగ్ కేంద్రాల్లో 12కోట్ల 79లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. నాలుగో దశలో 961 మంది అభ్యర్ధులు బరిలో ఉన్నారు. నాలుగో దశలోమహారాష్ట్రలో బాలీవుడ్ నటి ఊర్మిళ మతోండ్కర్, కాంగ్రెస్ సీనియర్ నేత సునీల్దత్ కూతురు ప్రియాదత్, బీజేపీ నేత పూనమ్ మహాజన్ ఎంపీలుగా పోటీచేస్తున్నారు. సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ ఉత్తరప్రదేశ్లోని కన్నౌజ్ లోక్ సభ స్ధానం నుంటి పోటీ చేస్తున్నారు. బీహార్లోని బెగూసరాయి నుంచీ సీపీఐ తరపున కన్హయ్య కుమార్, బీజేపీ నుంచి కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ పోటీ పడుతున్నారు.
రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కొడుకు వైభవ్… జోధ్పూర్లో అదృష్టం పరీక్షించుకుంటున్నారు. బీజేపీ సిట్టింగ్ ఎంపీ గజేంద్ర సింగ్ షెకావత్తో వైభవ్ పోటీ పడుతున్నారు. కాగా … మహారాష్ట్రలోని నార్త్ ముంబై, సౌత్ ముంబై , నార్త్ సెంట్రల్ ముంబై ఎన్నికలు ఈ ధశలోనే జరుగుతున్నాయి. నాలుగో విడతతో మహారాష్ట్రలో ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుండగా…రాజస్ధాన్,మధ్యప్రదేశ్ లలో తొలివిడత పోలింగ్ జరుగుతోంది.