Leander
Leander Paes గోవా అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీఎంసీలో జోష్ నెలకొంది. టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ ఇవాళ తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. శుక్రవారం గోవాలో.. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సమక్షంలో ఆయన తృణమూల్ కండువ కప్పుకున్నారు. లియాండర్ పేస్ చేరికను దీదీ స్వాగతిస్తూ.. పేస్ తనకు సోదరుడి వంటి వాడని పేర్కొన్నారు.
తాను యువజన సర్వీసుల మంత్రిగా ఉన్నప్పటి నుంచి పేస్తో పరిచయం ఉందని, అప్పుడతను చాలా చిన్నవాడని పేస్ టీఎంసీలోకి రావడం తనకు సంతోషంగా ఉందని దీదీ తెలిపారు. అంతకుముందు నటి, సామాజిక కార్యకర్త నఫిసా అలి,మహిళా వ్యాపారవేత్త మృణాళిని దేశ్ ప్రభు కూడా కూడా టీఎంసీలో చేరారు.
కాగా,వచ్చే ఏడాది ప్రారంభంలో జరిగే గోవా అసెంబ్లీకి ఎన్నికల్లో టీఎంసీ సత్తా చూపించాలని గట్టి వ్యూహంతో ముందుకు సాగుతున్నారు మమతబెనర్జీ. 40 అసెంబ్లీ స్థానాలున్న కేంద్రపాలిత ప్రాంతంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి సిద్ధమైన మమతా గురువారం మూడు రోజుల గోవా పర్యటకు వెళ్లారు.
ఇవాళ గోవా రాజధాని పనాజీలో మమత మాట్లాడుతూ..పశ్చిమ బెంగాల్ లాగానే గోవా కూడా బలమైన రాష్ట్రంగా ఉండాలని టీఎంసీ కోరుకుంటుంది.బెంగాల్ చాలా బలమైన రాష్ట్రం. భవిష్యత్తులో గోవా కూడా బలమైన రాష్ట్రంగా ఉండాలని మేము కోరుకుంటున్నాము. గోవా యొక్క కొత్త ఉదయాన్ని చూడాలనుకుంటున్నాము. మమతా జీ బెంగాల్లో ఉన్నారు, ఆమె గోవాలో ఎలా చేస్తారు? అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. ఎందుకు చేయలేం? నేను ఇండియన్ ని. నేను ఎక్కడికైనా వెళ్లగలను, మీరు ఎక్కడికైనా వెళ్లవచ్చు. నేను మీ సోదరిలాంటి దానిని. నేను మీ పవర్ ని దక్కించుకోవడానికి ఇక్కడకు రాలేదు. ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు మేము సహాయం చేయగలిగితే అది నా హృదయాన్ని తాకుతుంది. మీరు మీ పని చేస్తారు, ఈ ప్రక్రియలో మేము మీకు సహాయం చేస్తాము అంతే. నేను సెక్యూలరిజాన్ని నమ్ముతాను. నేను ఐక్యతను నమ్ముతాను. భారత్ మన మాతృభూమి అని నేను నమ్ముతాను. బెంగాల్ నా మాతృభూమి అయితే, గోవా కూడా నా మాతృభూమి అని పనాజీలో మమత అన్నారు. తనను హిందూ వ్యతిరేకిగా బీజేపీ చిత్రీకరిస్తోందని టీఎంసీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ఆమె పేర్కొన్నారు. టీఎంసీ అంటే టెంపుల్, మసీదు, చర్చ్ల కోసం నిలబడే పార్టీ అని తమకు అన్ని మతాలూ ఒకటేనని దీదీ తెలిపారు.
ALSO READ Puneeth Rajkumar : పునీత్ రాజ్ కుమార్ కన్నుమూత.. శోకసంద్రంలో శాండల్వుడ్..