Allahabad High Court : మైనర్ మొగుడు-మేజర్ పెళ్లాం : తిరస్కరించిన కోర్టు
ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ హై కోర్టు లో ఓ విచిత్రమైన కేసు విచారణ జరిగింది. ఓ బిడ్డకు తండ్రి అయిన మైనర్ మొగుడ్ని తల్లితో వెళ్ళమంటే కాదు భార్యతో వెళ్తా అన్నాడు. చట్ట ప్రకారం అది కుదరదు కాబట్టి మైనార్టీ తీరేంత వరకు బాలుడ్ని రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని షెల్టర్ హోం కు తరలించింది కోర్టు.
- murthy
- Published On : June 16, 2021 / 08:34 AM IST
Allahabad High Court
Allahabad High Court : ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ హై కోర్టు లో ఓ విచిత్రమైన కేసు విచారణ జరిగింది. ఓ బిడ్డకు తండ్రి అయిన మైనర్ మొగుడ్ని తల్లితో వెళ్ళమంటే కాదు భార్యతో వెళ్తా అన్నాడు. చట్ట ప్రకారం అది కుదరదు కాబట్టి మైనార్టీ తీరేంత వరకు బాలుడ్ని రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని షెల్టర్ హోం కు తరలించింది కోర్టు.
ఇన్నాళ్లు మైనర్ బాలికకు పెళ్లి… మైనర్ బాలికపై అత్యాచారం ఇలాంటి వార్తలు చూశాం.. కానీ ఉత్తర ప్రదేశ్ లోని అజంగఢ్ లో నివసించే మైనర్ బాలుడు తన కంటే పెద్దదైన యువతితో సహజీవనం చేస్తూ ఓ బిడ్డకు తండ్రి కూడా అయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న బాలుడు తల్లి హౌషిలాదేవి కొడుకును తమతో పంపించమని అలహాబాద్ హై కోర్టులో గతేడాది పిటీషన్ దాఖలు చేసింది.
2020, సెప్టెంబర్18 న బాలుడ్ని కోర్టులో హాజరు పరిచారు. జస్టిస్ జేజే మునీర్ నేతృత్వంలోని ధర్మాసనం బాలుడి వాంగ్మూలం నమోదు చేసుకుంది. మైనర్ బాలుడు తన భార్యతో బలవంతంగా ఉంటున్నట్లు చెప్పలేదు. ఇష్టపడే సహజీవనం చేస్తున్నట్లు ఒప్పుకున్నాడు. కేసు విచారణలో అతని భార్య భర్తను తనతో పంపించమని కోరింది. బాలుడు కూడా తన భార్యతోనే వెళతానని కోరాడు. కోర్టు అందుకు అంగీకరించలేదు. కేసులో ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు తీర్పు రిజర్వు చేసింది.
అనంతరం ఈ ఏడాది మే 31 న తీర్పు వెలువరిస్తూ….మైనర్ బాలుడి వివాహం చట్ట ప్రకారం చెల్లదు కాబట్టి… బాలుడ్ని మైనార్టీ తీరేంత వరకు ప్రభుత్వ సంరక్షణలోని షెల్టర్ హోంకు తరలించాలని ఆదేశించింది. 2022 ఫిబ్రవరి 4 తర్వాత, మైనార్టీ తీరాక మరోసారి బాలుడి వాంగ్మూలం నమోదుచేసి అతని ఇష్టం వచ్చిన వారివద్ద ఉండవచ్చని కోర్టు తీర్పు వెలువరించింది. తీర్పు కాపీలను అలహాబాద్ హై కోర్టు సోమవారం జూన్ 14న వెబ్ సైట్ లో అప్ లోడ్ చేసింది.
