Covid Vaccines : ప్రైవేట్ హాస్పిటల్స్ లో “నో వ్యాక్సిన్”..ఉత్తర్వులు జారీ
కేంద్రం నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసిన కరోనా వ్యాక్సిన్లను ప్రైవేట్ ఆసుపత్రులకు ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నారంటూ పంజాబ్ ప్రభుత్వంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో అమరీందర్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
- venkaiahnaidu
- Published On : June 4, 2021 / 09:18 PM IST
After Backlash Punjab Government Cancels Sale Of Vaccines To Hospitals
Punjab Government కేంద్రం నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసిన కరోనా వ్యాక్సిన్లను ప్రైవేట్ ఆసుపత్రులకు ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నారంటూ పంజాబ్ ప్రభుత్వంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో అమరీందర్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. 18-44 సంవత్సరాల వయసువారికి సింగిల్ డోస్ వ్యాక్సిన్ ప్రైవేటు హాస్పిటల్స్ ద్వారా సమకూర్చేందుకు జారీ చేసిన ఉత్తర్వులు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
ప్రైవేటు హాస్పిటల్స్ కు వ్యాక్సిన్ల సరఫరా పూర్తిగా నిలిపివేస్తున్నట్లు శుక్రవారం సాయంత్రం పంజాబ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా,వివిధ ప్రైవేటు హాస్పిటల్స్ లో ఉన్న వ్యాక్సిన్లను తిరిగి అప్పగించాలని పంజాబ్ ప్రభుత్వం ఆదేశించింది. వ్యాక్సిన్ ఫండ్ కింద ఆస్పత్రులు జమ చేసిన మొత్తాన్ని తిరిగి చెల్లిస్తామని తెలిపింది. అంతేకాకుండా వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థల నుంచి నేరుగా కొనుగోలు చేసిన వ్యాక్సిన్లను కూడా ప్రభుత్వానికి ఇచ్చేయాలని ఉత్తర్వుల్లో పంజాబ్ ప్రభుత్వం పేర్కొంది. తాజా ఆదేశాలు వెలువడక ముందే రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ఆరోగ్యశాఖ ఓ లేఖ రాసింది. రాష్ట్రంలో వ్యాక్సిన్ తీరుతెన్నుల గురించి సమగ్రంగా వివరించాలని కేంద్రం ఆ లేఖలో కోరింది.
పంజాబ్ ఆరోగ్య మంత్రి బీఎస్ సిద్దూ ఈరోజు ఉదయం స్పందిస్తూ…వ్యాక్సిన్లపై తనకు ఎలాంటి కంట్రోల్ లేదని… కేవలం ట్రీట్మెంట్, టెస్టింగ్, కరోనా వ్యాక్సిన్ క్యాంపులను మాత్రమే తాను చూసుకుంటున్నానని తెలిపారు. తాను కూడా వ్యక్తిగతంగా ఈ ఆరోపణలపై విచారణ జరుపుతానని చెప్పారు.
