అగ్రరాజ్యం అమెరికాలో మరో భారత విద్యార్థి మృతి.. ఈ ఏడాది ఇది పదో ఘటన
అగ్రరాజ్యం అమెరికాలో మరో భారత విద్యార్థి మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది.
- Thota Vamshi Kumar
- Published On : April 6, 2024 / 11:34 AM IST
Indian Student Dies In United States
Indian Student : అగ్రరాజ్యం అమెరికాలో మరో భారత విద్యార్థి మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. అతడి పేరు ఉమా సత్యసాయి గద్దె. ఓహియో రాష్ట్రంలోని క్వీన్ ల్యాండ్లో విద్యను అభ్యసిస్తున్నాడు. కాగా.. అతడు ఎలా చనిపోయాడు అనే విషయం ఇంకా తెలియరాలేదు. అతడి మరణం పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని న్యూయార్క్లోని భారత కాన్సులేట్ తెలిపింది. విద్యార్థి మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేసింది.
సత్యసాయి కుటుంబంతో తాము టచ్లో ఉంటామని, అతడి మృతదేహాన్ని వీలైనంత త్వరగా భారత్కు తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు రాయబార కార్యాలయం తెలిపింది. అయితే.. అతడు భారత దేశంలోని ఏ రాష్ట్రానికి, ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి అనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. కాగా.. 2024 సంవత్సరం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు అమెరికాలో మరణించిన విద్యార్థుల సంఖ్య 10కి చేరుకుంది.
Lok Sabha elections 2024 : న్యాయ్పత్ర పేరుతో కాంగ్రెస్ మ్యానిఫెస్టో విడుదల
మార్చి నెలలో క్లీవ్లాండ్లోనే భారతీయ విద్యార్థి మహమ్మద్ అబ్దుల్ అరాఫత్ అదృశ్యం అయ్యాడు. డబ్బులు ఇస్తేనే విడిచిపెడతామని అతడి కుటుంబానికి ఫోన్ కాల్స్ వచ్చాయి. మిస్సౌరీలోని సెయింట్ లూయిస్లో గత నెలలో కోల్కతాకు చెందిన శాస్త్రీయ నృత్యకారుడు అమర్నాథ్ ఘోష్ ను కాల్చి చంపారు. అదే నెలలో బోస్టన్ యూనివర్శిటీలో చదువుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 20 ఏళ్ల విద్యార్థి సైతం హత్యకు గురైయ్యాడు.
Also Read: కావ్యా పాప మళ్లీ నవ్వింది.. పక్కన ఉన్న అమ్మాయి ఎవరో తెలుసా?
ఈ సంవత్సరం ప్రారంభంలో హైదారబాద్కు చెందిన సయ్యద్ మజాహిర్ అలీ అనే విద్యార్థిపై చికాగోలో కొందరు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. చికాగోలోని భారత కాన్సులేట్ వెంటనే జోక్యం చేసుకుని అలీతో పాటు అతడి కుటుంబ సభ్యులకు మద్దతు ఇచ్చింది. భారతీయ విద్యార్థులపై జరుగుతున్న ఘటనలు అమెరికాలోని భారతీయ సమాజాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి.
