అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగిసింది. మొత్తం 60 అసెంబ్లీ స్థానాలకు గాను 46 స్థానాలను బీజేపీ గెలుచుకుంది. నేషనల్ పీపుల్స్ పార్టీకి 5 సీట్లు వచ్చాయి. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి 3 సీట్లు, పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ కి 2 సీట్లు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి ఒక సీటు, స్వతంత్ర అభ్యర్థులు 3 సీట్లు దక్కాయి. అరుణాచల్ ప్రదేశ్ లో బీజేపీ అధికారంలోకి రావడం ఇది వరుసగా మూడోసారి.
ఈటానగర్ సహా పలు ప్రాంతాల్లో బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. కాగా, ఇవాళ ఉదయం 6 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగింది. మే4న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు రానున్న విషయం తెలిసిందే. రెండు రోజుల ముందే అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ జరిగింది.
సిక్కింలో రెండోసారి ఎస్కేఎం విజయం
ఇక సిక్కింలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా వెలువడ్డాయి. ఆ రాష్ట్రంలో అధికార సిక్కిం క్రాంతికారి మోర్చా రెండోసారి అధికారంలోకి వచ్చింది. మొత్తం 32 సీట్లలో ఆ పార్టీ 31 స్థానాలను గెలుచుకోగా, సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ ఒకటి గెలుచుకుంది. ఆ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 16 సీట్లు అవసరం. ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ రెనాక్ అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికలలో విజయం సాధించారు.
Also Read: కూటమికి క్రేజ్ లేదు.. ఎగ్జిట్ పోల్ ఫలితాలపై మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు ..