Ayodhya: రామయ్య ఆలయంలో బంగారపు పాలరాతి సింహాసనం!
రామమందిరం నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. జనవరిలో ఆలయ ప్రారంభోత్సవం ఉన్న నేపథ్యంలో పనులను ముమ్మరం చేశారు కళాకారులు.
- Naga Srinivasa Rao Poduri
- Published On : November 2, 2023 / 10:23 AM IST
Ayodhya ram mandir 8 feet tall gold plated marble throne for Ram Lalla idol
Ayodhya Temple: అయోధ్య రామయ్య ఆలయం ప్రారంభానికి సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది జనవరి 22న ఆలయంలో దేవతామూర్తుల విగ్రహాల ప్రతిష్ఠాపన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో పనులు ముమ్మరం కాగా.. రాముడి విగ్రహాన్ని ప్రత్యేక సింహాసనంపై ఏర్పాటు చేసేందుకు కళాకారులు మెరుగులు దిద్దుతున్నారు. 8 అడుగుల ఎత్తు, 4 అడుగుల వెడల్పుతో బంగారు పూత పూసిన పాలరాతి సింహాసనాన్ని ప్రత్యేకంగా తయారు చేస్తున్నారు.
అయోధ్యలో శ్రీరాముడి కోసం ప్రత్యేకంగా సింహాసనం తయారు చేస్తున్నారు. బంగారు పూతతో పాలరాతి సింహాసనాన్ని రామమందిరం గర్భగుడిలో నెలకొల్పనున్నారు. దీనిపై రామ్లల్లా విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. రాజస్థాన్ కళాకారులు తయారు చేస్తున్న ఈ సింహాసనం 8 అడుగుల ఎత్తు, 4 అడుగుల వెడల్పు ఉంది. డిసెంబర్ 15 వరకు అయోధ్యకు చేరుకోనున్న ఈ సింహాసనంపై వచ్చే ఏడాది జనవరి 22న రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు.
మరోవైపు.. రామమందిరం నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. జనవరిలో ఆలయ ప్రారంభోత్సవం ఉన్న నేపథ్యంలో పనులను ముమ్మరం చేశారు కళాకారులు. డిసెంబర్ 15 నాటికి గర్భగుడి నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇక మొదటి అంతస్థుల్లో 80 శాతం పనులు పూర్తి కాగా.. ఇప్పటి వరకు 17 స్తంభాలు ఏర్పాటు చేశారు. ఫస్ట్ ఫ్లోర్ పైకప్పు నిర్మాణం కూడా డిసెంబర్ 20లోగా పూర్తి చేసేలా పనులు చేపడుతున్నారు.
Also Read: 110 రోజులు కఠిన ఉపవాసం చేసిన బాలిక.. ఎందుకో తెలుసా..?
ఇక పరిక్రమ మార్గ్లోని ఫ్లోరింగ్ పనులు పూర్తికాగా.. భక్తుల సౌకర్యం కోసం ఆలయంలోని మూడు అంతస్తుల్లో పైకప్పులు నిర్మించారు. మందిరం ప్రవేశ ద్వారం వెలుపలి గోడ పనులు కూడా చివరి దశకు చేరగా.. వీటిని ఈ నెలాఖరులో పూర్తి చేయనున్నారు. ఇక గృహ మండపం నేలపై మార్బుల్స్వేసే పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి.
Also Read: రోడ్లపై రయ్ మంటూ దూసుకుపోతున్న బుల్లి బుల్లెట్ బండి భలే ఉందే!
రామాలయం నిర్మాణం కోసం పెద్ద మొత్తంలో బంగారం, వెండి వస్తువులతో పాటు నాణాలు, ఇటుకలు విరాళంగా వచ్చాయి. వీటిని కరిగించి ఆలయంలోని తలుపులకు పూతగా వేయనున్నారు. దాదాపు 12 కోట్లతో రామాలయంలో మొత్తం 46 డోర్స్కు బంగారు పూత పూయనున్నారు.
