Bengaluru Schools : కర్ణాటకలో నైట్ కర్ఫ్యూ ఎత్తివేత.. స్కూళ్లు రీఓపెన్.. ఎప్పటినుంచంటే?
కర్ణాటకలో జనవరి 31 నుంచి నైట్ కర్ఫ్యూను ఎత్తివేయనున్నట్టు ప్రకటించింది. బెంగళూరులో ఫిజికల్ క్లాసులు కూడా పునఃప్రారంభం కానున్నాయి.
- Sreehari A
- Published On : January 29, 2022 / 04:01 PM IST
Bengaluru Schools Night Cur
Bengaluru Schools : దేశంలో కరోనా కేసులు తీవ్రత క్రమంగా తగ్గుతోంది. దేశ రాజధాని ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కర్ణాటకలో జనవరి మొదటివారం వరకు కరోనా కేసులు పెరగడంతో ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విధించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు కేసులు తగ్గిపోవడంతో కర్ణాటక ప్రభుత్వం ఆంక్షల సడలింపుపై దృష్టిపెట్టింది. అందులోభాగంగానే కొన్ని కోవిడ్ -19 పరిమితులను సడలించాలని శనివారం ప్రభుత్వం నిర్ణయించింది.
కర్ణాటకలో సోమవారం (జనవరి 31) నుంచి నైట్ కర్ఫ్యూను ఎత్తివేయనున్నట్టు ప్రకటించింది. బెంగళూరులో ఫిజికల్ క్లాసులు కూడా పునఃప్రారంభం కానున్నాయి. గత 15 రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ.. రాష్ట్రంలో మెరుగైన రికవరీ రేటు ఉందని, ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య నియంత్రణలో ఉందని అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రప్రభుత్వం ఈ దిశగా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
స్కూళ్లను సోమవారం నుంచి తెరవనున్నట్లు రాష్ట్ర మంత్రి బీసీ నగేశ్ వెల్లడించారు. బెంగుళూరులో స్కూళ్లు ఓపెన్ తెరుచుకుంటాయని, కరోనా నిబంధనలను తప్పనిసరిగా పాటించేలా అన్ని శాఖలకు ఆదేశాలు జారీ అయినట్టు మంత్రి నగేశ్ తెలిపారు. పెళ్లి వేడుకల్లో నిబంధనలు ఎత్తేస్తున్నట్టు చెప్పారు. ఇండోర్లో జరిగే పెళ్లి వేడుకలకు 200 మంది, ఔట్డోర్లో జరిగే వేడుకలకు 300 మంది మాత్రమే హాజరయ్యేందుకు అనుమతి ఉంటుంది.
ఇక జిమ్లను 50 శాతం సామర్థ్యంతో తెరుచుకోవచ్చు. బార్లు, హోటళ్లను తెరిచేందుకు అనుమతి ఇచ్చారు. ప్రభుత్వ ఆఫీసుల్లో 100 శాతం ఉద్యోగులతో పనిచేయనున్నట్లు మంత్రి నరేశ్ పేర్కొన్నారు. ఆలయాల్లో పూజలకు అనుమతి ఇచ్చారు. ధర్నాలు, మతపరమైన, రాజకీయమైన కార్యక్రమాలకు మాత్రం అనుమతి లేదని మంత్రి నగేశ్ తెలిపారు. క్రీడా మైదానాలు, స్టేడియంల్లో 50 శాతానికి అనుమతి ఇచ్చినట్టు మంత్రి నగేశ్ తెలిపారు.
Read Also : Medaram Mahajatra : మేడారం మహాజాతర కోసం 10 వేల మంది పోలీసులు
