Bihar minister skewers officials then he says call me leader of thieves
Leader Of Thieves: బిహార్కు వ్యవసాయ శాఖ మంత్రి సుధాకర్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏకంగా తన శాఖపైనే తీవ్రమైన ఆరోపణలు చేశారు. వ్యవసాయ శాఖలోని ఏ విభాగంలోనూ దొంగలకు కొదువ లేదని అన్నారు. అంతటితో ఆగకుండా ఆ దొంగలందరికీ తాను లీడర్నని చెప్పుకున్నారు. ధాన్యం కొనుగోలు, విత్తనాలు-ఎరువుల విక్రయాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందనే ఆరోపణలపై ఆయన స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు బిహార్ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారి తీశాయి.
రాష్ట్రీయ జనతా దళ్ పార్టీకి చెందిన ఈయన కొద్ది రోజుల క్రితం జేడీయూ-ఆర్జేడీ నేతృత్వంలో ఏర్పాటైన ప్రభుత్వంలో వ్యవసాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయనకు ఆదివారం సన్మానం చేశారు. ఈ సన్మాన సభలో పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు. తమ సమస్యలను రైతులు మంత్రికి ఏకరువు పెట్టారు. వ్యవసాయ శాఖలో అవినీతి రాజ్యమేలుతోందని, ధాన్యం కొనుగోలు, విత్తనాలు-ఎరువుల విక్రయాల్లో ఇది తీవ్రంగా ఉందని మంత్రికి రైతులు ఫిర్యాదు చేశారు.
కాగా, రైతులు చేసిన ఫిర్యాదులు విని మంత్రి ఆగ్రహానికి లోనయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘‘వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న నన్ను మీరు దొంగలకు లీడర్ అని పిలవొచ్చు. ఎందుకంటే ఈ శాఖలో దొంగలు లేని చోటు లేదు. నేను ఈ శాఖకు ఇంచార్జిని కాబట్టి.. ఆ దొంగలకు నేనే బాస్ అని నన్ను అనడంలో తప్పు లేదు’’ అని అన్నారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘ఈ మధ్యే నేను జముయి, ముంగర్ జిల్లాల్లో పర్యటించాను. వర్షాపాతం అతి తక్కువ నమోదు కావడం వల్ల ఆ జిల్లాల్లో దారుణమైన కరువు ఉంది. 100 ఏళ్లలో ఎన్నడూ లేనంత కరువు ఇప్పుడు బిహార్ లో ఉంది. కానీ అధికారిక లెక్కల్లో మాత్రం వ్యవసాయం బాగా కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. వర్షాలు బాగా పడ్డాయని, సాగు విస్తీర్ణం పెరిగిందని, ఆ ప్రాంతమంతా పచ్చదనం ఆవరించిందని అధికారులు తప్పుడు లెక్కలు రాశారు. ఇదిలా ఉంటే బిహార్ రాజ్య బీజ్ నిగమ్ లిమిటెడ్ నుంచి విత్తనాలు కొనేందుకు రైతులు ధైర్యం చేయడం లేదు. కానీ కార్పొరేషన్ కొనసాగుతోంది. ఎందుకంటే కార్పొరేషన్ గణాంకాల మీద నడుస్తోంది, వాస్తవాల మీద కాదు’’ అని అన్నారు.
Earthquake In China: 93కు చేరిన మృతుల సంఖ్య, మరో 25 మంది కోసం గాలింపు