ఢిల్లీ : బడ్జెట్ 2019 ఇంటి యజమానులకు కూడా ఊరట కలిగించింది. రెండో ఇంటిపై వచ్చే ఆదాయానికి పన్ను కట్టాల్సినవసరం లేదని తాత్కాలిక కేంద్ర ఆర్థికమంత్రి పీయూష్ గోయెల్ ప్రకటించారు. ఫిబ్రవరి 01వ తేదీన పార్లమెంట్లో 2019-20 తాత్కాలిక బడ్జెట్ని ప్రవేశపెట్టారు. ఇందులో వరాల వర్షం కురిపించారు. అమ్ముడుపోని ఇళ్లపై అద్దెకు ఇచ్చే పన్ను మినహాయింపును ఏడాది నుండి రెండేళ్లకు పెంచారు. రూ. 2 కోట్ల వరకు కేపిటల్ గెయిన్స్ పన్ను పడకుండా ఉండొచ్చు.
ప్రస్తుత నిబంధనల ప్రకారం అద్దెకు ఇచ్చిన ఇంటిపై యజమానికి ఏడాదికి రూ. 18 లక్షలకు మించిన ఆదాయం వస్తే కిరాయిదారు..దాని మీద పన్ను సొమ్మును మినహాయించుకుని మిగిలిన సొమ్మును అద్దెగా యజమానికి చెల్లించాల్సి ఉంటుంది. పన్ను మొత్తాన్ని తానే ఆదాయ పన్ను శాఖకు జమ చేయాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఇంటి యజమానులకు…కిరాయిదారులకు ఘర్షణలు తలెత్తుతున్నాయి. ప్రధానంగా టీడీఎస్ విధానంలో…నెలవారీ అద్దె రూ. 20 వేలు దాటితే కానీ టీడీఎస్ వర్తించదు. నిర్మాణంలో ఇంటి విక్రయంపై 12 శాతం, గృహ నిర్మాణ పథకాల కింద నిర్మించిన ఇళ్లకు 8 శాతం జీఎస్టీ వసూలు చేస్తున్నారు. పూర్తయిన ఇంటిపై జీఎస్టీ ఉండదు.