చెన్నై: ఏదన్నా ఫుడ్ కావాలంటే పొయ్యి లేకుండా వంట చేయటం కుదురుతుందా..పొయ్యి ఉందనుకోండి..దాని మీద బాండీ పెట్టి..ఆయిల్ పోసి..కుక్ చేస్తేనే గానీ ఫుడ్ నోటికి రాదు. అవేమీ లేకుండానే కేవలం 3.05 నిమిషాల్లోనే 300 రకాల ఫుడ్ ఐటెమ్స్ తయారు చేసి రికార్డ్ సృష్టించారు చెన్నై విమానాశ్రయ సిబ్బంది, విద్యార్థులు. ఈ రికార్డ్ లో ప్రకృతి సిద్ధమైన ఆహార పదార్థాలు తయారుచేసి ప్రపంచ రికార్డు సాధించారు. ఆరోగ్యానికి మేలుచేసే ఆహారంపై ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో ఇలా చేశామని భారత విమానాశ్రయాల అథారిటీ, జియో ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ చెఫ్ పి.శివకుమార్ తెలిపారు.
ప్రముఖ చెఫ్ పి.శివకుమార్ సారథ్యంలో విమానాశ్రయ సిబ్బంది, పలు కాలేజీలకు చెందిన 300ల మంది స్టూడెంట్స్ కు ట్రైనింగ్ ఇచ్చారు. 5నిమిషాల్లో 300రకాల పదార్థాలు తయారీ టార్గెట్ పెట్టుకోగా 3.05 నిమిషాల్లోనే సాధించారు. చెన్నై విమానాశ్రయ ప్రాంగణంలోని కల్యాణ మండపంలో బుధవారం (జనవరి 30)న నిర్వహించిన ఈ కార్యక్రమంలో సపోటా పాయసం, కొబ్బరి జామ్, బాదం పిసిన్ జామ్, నవధాన్య మొలకల పాలు వంటివి తయారు చేశారు. వారికి యూనివర్సల్ అచీవర్స్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు ఈ రికార్డ్ సర్టిఫికేషన్ డాక్యుమెంట్స ను అందజేశారు.