BJP vs Police: మమతా బెనర్జీ ప్రభుత్వ అవినీతిని నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పశ్చిమ బెంగాల్ సెక్రెటేరియట్ ముట్టడికి చేపట్టిన ‘నబన్న అభియాన్’ (సెక్రటేరియట్) యాత్ర ఉద్రిక్తలకు దారి తీసింది. సెక్రటేరియట్ ముట్టడికి వస్తున్న బీజేపీ నేతలను, కార్యకర్తలను బెంగాల్ పోలీసులు ఎక్కడివారినక్కడే అడ్డుకున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే బీజేపీ కార్యకర్తల్ని రాజధాని కోల్కతాలోకి ప్రవేశించక ముందే నిలిపివేశారు. అయితే కొందరు పోలీసుల్ని చేధించుకుని ముందుకు కదిలే ప్రయత్నం చేశారు. ఈ నేపధ్యంలో పోలీసులకు బీజేపీ కార్యకర్తలకు మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఇరు వర్గాల వారు ఒకరినొకరు తోసుకున్నారు.
సెక్రటేరియట్ సమీప ప్రాంతాలు సహా.. నగరంలోని అనేక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున బారికెడ్లే ఏర్పాటు చేశారు. ఎక్కడి వారిని అక్కడే ఆపుతుండడంతో పలు ప్రాంతాల్లో ఘర్షణ వాతావరణం నెలకొంది. రాణిగంజ్ రైల్వే స్టేషన్ ఆవరణలో అయితే ఈ ఘర్షణ మరింత తీవ్రమైంది. పోలీసులు, బీజేపీ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. అనంతరం పలువురు బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. దుర్గాపూర్ రైల్వే స్టేషన్లో 20 మంది బీజేపీ కార్యకర్తల్ని అరెస్ట్ చేశారు. అయితే పోలీసులు చర్యలపై బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడింది. శాంతియుతంగా చేపట్టిన ర్యాలీపై ఇంత నియంతృత్వం ఏంటని విరుచుకుపడింది.
ఈ విషయమై బెంగాల్ అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు, రాష్ట్ర బీజేపీ కీలక నేత సువేందు అధికారి స్పందిస్తూ రాష్ట్రాన్ని ఉత్తర కొరియాలా మార్చారని మండిపడ్డారు. మమతా బెనర్జీకి ప్రజల మద్దతు లేదని, అందుకే నియంతృత్వంతో ప్రజా ఉద్యమాన్ని పోలీసుల చేత తొక్కి పట్టాలని చూస్తున్నారని విమర్శించారు. నిన్న, ఈరోజు ఏం జరిగిందో పోలీసులు గుర్తు పెట్టుకోవాలని, రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీయే అధికారంలోకి వస్తుందని సువేందు హెచ్చరించారు.